పోలీసు అధికారితో షూ లేస్ కట్టించుకున్న మంత్రి
కోల్కత్తా: ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే సంఘటన ఇది. సెక్యూరిటీ గార్డుతో తన షూ లేసుని కట్టించుకున్నాడో మంత్రి. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ సచివాలయంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రణాళిక మంత్రిగా ఉన్న రాచ్పాల్ సింగ్ ఈరోజు కోల్కత్తాలో తన సెక్యూరిటీ గార్డు అధికారితో తన షూ లేస్ కట్టించుకున్నాడు. రాష్ట్ర సచివాలయం నబాన్నాలో సినీ నటుడు రాంకింకర్ భాయిజీకి పుట్టినరోజు సందర్భంగా నివాళుర్పించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి అక్కడ తన వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుతో షూ లేసు కట్టించుకున్నాడు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన రాచ్పాల్ సింగ్, తారాకేశ్వర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు మంత్రి గతంలో ఐపీఎస్ అధికారిగా కూడా పనిచేశారు.
తన వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు షూ లేస్ కట్టిన వీడియో పూటేజిని స్ధానిక మీడియా హైలెట్గా చూపించింది. దీంతో ఈ వీడియో పుటేజిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై కోల్కత్తా మాజీ మేయర్, సీపీఐ-ఎం లీడర్ బికాస్ రంజన్ భట్టాచార్య మాట్లాడుతూ ఇలాంటి విషయాన్ని 21వ శతాబ్దంలో ఊహించలేమని, ఈ సంఘటన తృణమూల్ కాంగ్రెస్, ఆ పార్టీ రాజకీయ నాయకుల దివాలానుప్రతిబంబిస్తుందని అన్నారు.
సామాజిక ఉద్యమకర్త మిరుతన్ నహర్, థియేటర్ పర్సనాలిటీ కౌశిక్ సేన్ ఈ సంఘటనను ఖండించారు. ఈ సంఘటన ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదని మాజీ పోలీస్ అధికారి సమీర్ గంగూలీ వ్యాఖ్యానించారు.