కళ్లు తిరిగాల్సిందే: 2015లో సుందర్ పిచాయ్ జీతం అంతా?
న్యూఢిల్లీ: సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ 2015లో జీతభత్యాల కింద రూ. 667 కోట్లు (100.5 మిలియన్ డాలర్లు) అందుకున్నారు. గతేడాది ఆయన జీతం కింద 652,500 డాలర్లు (రూ. 4.32కోట్లు) లభించగా, రిస్ట్రిక్టెడ్ వాటాల కింద 99.8 మిలియన్ డాలర్ల (రూ. 662 కోట్లు)ను పొందారు.
ఈ మొత్తాన్ని 2017 తర్వాత పూర్తిస్థాయిలో నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. ఇతర భత్యాల కింద 22,935 డాలర్లు పిచాయ్కు అందాయి. రెగ్యూలేటరీ ఫిల్లింగ్స్ ప్రకారం సుందర్ పిచాయ్ జీతభత్యాల వివరాలు వెల్లడించింది. 2015 ఆగస్టులో గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవలే గూగుల్ మాతృసంస్థ ఆల్పాబెట్ కింద మిగతా ఉత్పత్తులను పునర్వ్యవస్థీకరించారు. పిచాయ్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించడానికి ముందు గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ బాధ్యతలు చూసుకున్నారు. అనంతరం పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు గత ఫిబ్రవరిలో 199 మిలియన్ డాలర్ల (1,320 కోట్లు) రిస్ట్రిక్టెడ్ వాటాలను బహుమతిగా అందించింది.
2004లో ప్రాడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా పిచాయ్ గూగుల్ చేరారు. ఆయన నాయకత్వంలోనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ను విడుదల చేశారు. 2008లో అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలైన గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్గా విశేషమైన ఆదరణను పొందింది. ఆ తర్వాత మార్చి 2013లో ఆండ్రాయిడ్ కో ఫౌండర్, సీఈఓ అండీ రూబెన్ పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పదవిని పిచాయ్ నిర్వహించారు.