భూటాన్ బుల్లి యువరాజుకు మోడీ కానుక ఏంటో తెలుసా?(పిక్చర్స్)
నాలుగు రోజులపాటు భారత పర్యటనకు వచ్చిన భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ దంపతులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.
న్యూఢిల్లీ: నాలుగు రోజులపాటు భారత పర్యటనకు వచ్చిన భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ దంపతులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్యల్ వాంగ్చుక్తో ప్రధాని మోడీ కాసేపు సరదాగా గడిపారు.
బుల్లి యువరాజుకు మోడీ కానుక
అనంతరం చిన్నారి యువరాజుకు ప్రధాని మోడీ బహుమతులు ఇచ్చారు. ఇటీవల భారత్లో జరిగిన ఫిఫా అండర్-17 వరల్డ్కప్లో ఉపయోగించిన అధికారిక ఫుట్బాల్, ఒక చెస్ సెట్ను ప్రధాని కానుకగా ఇచ్చారు.
సంతోషమే..
కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలను మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. భూటాన్ రాజకుటుంబాన్ని కలవడం సంతోషంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల సంబంధాలపై చర్చ
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వాంగ్చుక్ దంపతులు మంగళవారం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మోడీతో సమావేశమైన వాంగ్చుక్.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా డోక్లాం అంశంపై చర్చించినట్లు సమాచారం.
రాష్ట్రపతి, కేంద్రమంత్రులతోనూ..
అంతకుముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ను వాంగ్చుక్ దంపతులు కలిశారు. గురువారం కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్తో వారు సమావేశమయ్యారు.