గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్న అయోధ్య దీపోత్సవం.. ట్విట్టర్ లో అభినందించిన గిన్నిస్ బుక్
దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం లో దేదీప్యమానంగా వెలుగొందిన దీపోత్సవం గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది. దీపావళి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగరం లోని సరయు నది ఒడ్డున దీపాలతో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రామ్ కి పైడి ఘాట్ ల వద్ద 6,06,569 దీపాలు ఒకేసారి ఐదు నిమిషాల పాటు కాంతులీనాయి . ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో తలపెట్టిన ఈ దీపోత్సవం గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుందని తాజాగా చేసిన ట్వీట్ తో తెలుస్తుంది.
దీపావళి కానుకగా తెలంగాణా సర్కార్ బంపర్ ఆఫర్ ..ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ

యూపీలో దీపోత్సవం .. గిన్నిస్ బుక్ లో స్థానం
నాలుగవ దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా సరయు నది ఒడ్డున, అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలో, రామ్ కి పైడి తదితర ఘాట్ ల వద్ద మట్టి ప్రమిదలను ఏర్పాటుచేసి దీపాలను వెలిగించి, దీపావళి సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని నిర్ధారించడానికి గిన్నీస్ బుక్ బృందం హాజరైంది. ఈ ప్రపంచ రికార్డును సృష్టించటం ద్వారా గతేడాది అయోధ్యలో 4,10,206 నెలకొల్పిన రికార్డును తానే బద్దలు కొట్టినట్లు అయింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ కి పైడి ఘాట్ వద్ద మొదటి దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా హాజరయ్యారు.

దీపోత్సవ కార్యక్రమలో పాల్గొన్న వారిని అభినందించిన సీఎం యోగి
అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డుగా, విజయవంతంగా నిర్వహించినందుకు సిఎం అభినందించారు.
ఫైజాబాద్లోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 8,000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయోధ్య అధికార యంత్రాంగం, రామ్ మనోహర్ లోహియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మరియు ఈ ప్రపంచ రికార్డు సృష్టించినందుకు స్వచ్ఛంద సేవకులందరినీ అభినందిస్తున్నాను అని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

యూపీ టూరిజం రంగానికి , రామ్ మనోహర్ లోహియా అవధ యూనివర్సిటీకి గిన్నిస్ బుక్ అభినందనలు
2018 దీపోత్సవంలో కూడా 3.1 లక్షల మట్టి దీపాలను వెలిగించిన గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు.
యుపిలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత (మార్చి 2017), ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఇక తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి రామ్ మనోహర్ లోహియా అవధ విశ్వవిద్యాలయానికి గిన్నిస్ బుక్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి దేదీప్యమానంగా వెలుగుతున్న దీప కాంతులతో కూడిన సుందర దృశ్యాలను, ఫోటోలను ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన వారిని ప్రశంసించారు గిన్నిస్ బుక్ రికార్డ్ సభ్యులు. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా తెలియజేశారు.