గుజరాత్ సీఎంకు రూ. 9 కోట్లు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి రూ. 140 కోట్ల ఆస్తులు, కుబేరుడితో సీఎం ఢీ
గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ నాయకులు 20 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ నాయకులు 20 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణికి పోటీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కుబేరుడిని పోటీకి దింపారు.
Recommended Video
కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్ గురు ఆర్థికంగా కుబేరుడు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి డిసెంబర్ లో ఆ రాష్ట్రంలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో రాజ్ కోట్ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు.
తన దగ్గర రూ. 9.08 కోట్ల ఆస్తి ఉందని సీఎం విజయ్ రూపాణి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. సీఎం విజయ్ రూపాణి దగ్గర రూ. 3. 45 కోట్ల విలువైన నగదు, బంగారం ఉంది. సీఎం విజయ్ రూపాణి భార్య పేరుతో రూ. 1.97 కోట్ల విలువైన చరాస్తి ఉంది.
గుజరాత్ సీఎం విజయ్ రూపాణి, ఆయన భార్య పేరుతో రూ. 3. 65 కోట్ల విలువైన స్థిరాస్తి ఉందని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు. విజయ్ రూపాణి మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్ గురు తన దగ్గర రూ. 140 కోట్ల విలువైన చరాస్తి, స్థిరాస్తులు ఉన్నాయని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు.
ఇంద్రనీల్ రాజ్ గురు చదవింది మాత్రం ఇంటర్మీడియట్. ఇంద్రనీల్ రాజ్ గురు దగ్గర రూ. 4. 5 కోట్ల విలువైన విలాసవంతమైన విదేశీ కారుతో పాటు ల్యాండ్ రోవర్, బీఎండబ్ల్యూ, ఇన్నోవాతో సహ మొత్తం 12 ఖరీదైన కార్లు ఉన్నాయి. రూ. 124. 59 కోట్ల విలువైన స్థిరాస్తి, రూ. 16. 63 కోట్ల చరాస్తి ఉందని ఇంద్రనీల్ రాజ్ గురు అధికారికంగా ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించారు.