రేప్ బాధితురాలి అబార్షన్ కు కోర్టు 'నో'
అహ్మదాబాద్ : 14 ఏళ్ల ఓ రేప్ బాధితురాలి కడుపులో పెరుగుతోన్న పిండాన్ని తొలగించడానికి నిరాకరించింది గుజరాత్ హైకోర్టు. సోమవారం నాడు ఈ కేసు విచారణకు రాగా కోర్టు ఇలా స్పందించింది. ప్రస్తుతం బాలిక 28 నెలల కడుపుతో ఉండడంతో.. ఈ దశలో పిండాన్ని తొలగించడం బాలిక ప్రాణానికే ప్రమాదమని పేర్కొన్న కోర్టు అందుకు నిరాకరించింది.
బాలిక ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు కోర్టుకు సమర్పించిన నివేదికను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి సోనియా గోకాని.. 28 నెలల కడుపుతో ఉన్న బాలికకు అబార్షన్ చేయడం సరికాదన్నారు. బాధిత బాలిక మరియు ఆమెకు పుట్టబోయే బిడ్డ సంరక్షణ కోసం.. బాలిక నివాసముండే దొరాజీ జిల్లా ప్రాంతంలోనే ఏదైనా ఎన్జీవో సంరక్షణ కేంద్రాలు ఉంటే.. ఆ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది.
సెప్టెంబర్ 14 లోపు ఏవైనా ఎన్జీవో సంరక్షణ కేంద్రాలు లేక అనాథ శరణాలయాలు లేక ఇతరత్రా వాటి వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించాల్సిందిగా జస్టిస్ సోనియా గోకాని ఆదేశాలు జారీ చేశారు. అప్పటిదాకా బాలికను ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాల్సిందిగా పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం 24 నెలల గర్బంతో ఉన్న బాలిక.. ఏడు నెలల కిందట తన స్నేహితుడి తండ్రి చేతిలో అత్యాచారానికి గురైంది. అనంతరం అగస్టు 1వ తేదీన సదరు నిందితుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదిలా ఉండగానే బాలికకు అబార్షన్ చేయించేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే పిండాన్ని తొలగించడం ఆమెపై శారీరకంగా మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు పేర్కొనడంతో.. కోర్టు కూడా వైద్యుల నివేదిక మేరకే పిండాన్ని తొలగించడం కుదరదని, ఇది బాలిక ఆరోగ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదని తెలిపింది.