బీజేపీకి చెమటలు పడుతున్నాయ్..!!
అహ్మదాబాద్/సిమ్లా: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీకి బిగ్ డే. ప్రస్తుతం అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ నెల 5వ తేదీన గుజరాత్లో రెండో దశ పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ రూపాన్ని దాల్చుతాయా? లేదా? అనేది స్పష్టం కానుంది.
గుజరాత్లో మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 1, 5 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 89, రెండో విడతలో 93 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. హిమాచల్ ప్రదేశ్లో కిందటి నెల 12వ తేదీన ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. ఈ రెండు చోట్ల కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూసుకుంటే - గుజరాత్లో ఓటర్లు వార్ వన్ సైడ్ చేసినట్టే కనిపిస్తోంది. మరోసారి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా తేలింది.
గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 92. దీన్ని అవలీలగా బీజేపీ అందుకుంటుందనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిమాచల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మొత్తం 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో అధికారం పొందాలంటే కావాల్సిన సంఖ్యాబలం 35.
ఈ ఫిగర్ను అందుకోవడంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తొలి గంటలో వెనుకపడిన హస్తం పార్టీ- ఆ తరువాత దూసుకొచ్చింది. బీజేపీని వెనక్కి నెట్టింది. కాంగ్రెస్ 36, బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన 35 స్థానాల కంటే కాంగ్రెస్ ఒక్క సీటు ఎక్కువే సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారే అవకాశం లేకపోలేదు. అది ఏ పార్టీకి అనేది క్రమంగా తేలుతుంది.
ఇక గుజరాత్లో బీజేపీ ప్రభంజనం వీస్తోంది. ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మేజిక్ పని చేస్తోంది. గుజరాత్లో 139 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్స్ 32 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ఏడు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమైంది.