ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ ను పాక్ కు చేరవేస్తున్న ఇద్దరి అరెస్టు
అహ్మదాబాద్ : భారత ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్ ఇంటలిజెన్స్ కు చేరవేస్తోన్న మొహమ్మద్ అలానా,సఫుర్ అనే ఇద్దరు వ్యక్తులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో కొంతకాలంగా వీరిపై నిఘా పెట్టిన టెర్రరిస్ట్ స్క్వాడ్ కచ్ జిల్లాలో ఇద్దరినీ అరెస్టు చేసింది.
కాగా, వీరిద్దరు గత కొంతకాలంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి రహస్యంగా చేరవేస్తున్నట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పథకం ప్రకారం పాకిస్తాన్ మహిళలు వీరిద్దరిని ముగ్గులోకి దింపి ఆర్మీ వివరాలు కూపీ లాగుతున్నారు.
గతేడాది నుంచి వీరి కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయని గుర్తించిన ఏటీఎస్ అధికారులు.. అప్పటినుంచి ప్రత్యేక నిఘా పెడుతూ వస్తుండడంతో తాజాగా అసలు విషయం వెలుగుచూసింది. నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి ఆర్మీ, పారామిలటరీ దళానికి చెందిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాకిస్తాన్ కు చెందిన ఓ సిమ్ కార్డు కూడా వారి వద్ద లభ్యమవడం గమనార్హం.