బీజేపీ షాక్ ఇచ్చిన శివసేన, రాహుల్ గాంధీకి జై, మోడీ వస్తేనే అది జరిగిందా?
Recommended Video
ముంబై: బీజేపీ మిత్రపక్షం శివసేన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించింది. గుజరాత్ శాసన సభ ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ పోరాటం అద్భుతంగా ఉందని శివసేన ప్రశంసలు కురిపించింది. ఇటీవల రాహుల్ గాంధీని శివసేన ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇప్పుడు మరో సారి బీజేపీ మీద రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని మరో సారి గుర్తు చేసిన శివసేన యువరాజును నెత్తిన పెట్టుకుంది.
ఫలితాలతో పని లేదు
గుజరాత్ శాసన సభ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా, దాని గురించి అస్సలు ఆలోచించకుండా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన పోరాటం అద్భుతంగా ఉందని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక పత్రిక సామ్నాలో అన్నారు.
అభ్యంతరం లేదు
అతి పెద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారని, బాధ్యతను కీలక దశలో భుజానికెత్తుకున్నారని ఉద్దవ్ ఠాక్రే ప్రశంసించారు. రాహుల్ గాంధీకి అభినందనలు చెప్పడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.
ప్రధాని మోడీతో పోరాటం
ఎలాంటి ఫలితాలు ఊహించకుండానే గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచార బరిలో రాహుల్ గాంధీ దిగి ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొన్నారని, ఓడిపోతామేమోనని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాహుల్ గాంధీ ఏమాత్రం ఆందోళన చెందలేదని ఉద్దవ్ ఠాక్రే గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ విశ్వాసం
రాహుల్ గాంధీ విశ్వాసమే ఆయనను రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకువెలుతుందని తాను నమ్ముతున్నానని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి నడిపిస్తారా ? ఓటమి వైపు తీసుకు వెలుతారా అనేది రాహుల్ గాంధీ సొంత విషయానికి వదిలేయాల్సి ఉంటుందని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు.
నరేంద్ర మోడీ వస్తేనే జరిగిందా?
శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు. దేశంలో గత 60 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని బీజేపీ నాయకులు అనుకుంటున్నారని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే దేశం మొత్తం అభివృద్ధి చెందిందని అంటున్నారని, వారి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఉద్దవ్ ఠాక్రే మరోసారి బీజేపీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.