గుజరాత్: నేటితో ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం, 9న పోలింగ్
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం గురువారం సాయంత్రం ముగిసింది. మొత్తం 182 స్థానాలకు గానూ.. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్, కచ్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు డిసెంబర్ 9న పోలింగ్ జరగనుంది.
తొలి విడత ఎన్నికల బరిలో గుజరాత్ సీఎం విజయ్రూపాని సహా 977 మంది అభ్యర్థులు ఉన్నారు. కాగా, డిసెంబర్ 14న మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు.
సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో అధిక స్థానాలు ఉండడంతో ఇక్కడ ఆధిక్యత సంపాదించడం అన్ని పార్టీలకు కీలకంగా మారింది. సౌరాష్ట్ర, పశ్చిమ గుజరాత్లలో ప్రధాని మోడీ 14 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు రాహుల్ ప్రచారం చేశారు.
కాగా, గత 22ఏళ్లుగా అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న బీజేపీ మరోసారి ఎన్నికల్లో గెలుపొంది.. గుజరాత్ తమకు కంచుకోటగా నిరూపించుకోవాలని చూస్తోంది. ఇప్పటికైతే ఓపినియన్ పోల్స్ కూడా బీజేపీదే అధికారమంటున్నాయి.