పాటీదార్లు డామినేషన్, మొరాయించిన 40 ఈవీఎంలు, కాంగ్రెస్ ధర్నా, బీజేపీ కావాలనే!
సూరత్/అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఎక్కడ ఓడిపోతామో అనే భయంతోనే బీజేపీ నాయకులు పనికిరాని ఈవీఎంలు తెప్పించి పెట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అనేక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
Recommended Video
పాటీదార్ ఓట్లు ఎక్కువ!
సూరత్, బోర్ బందర్, రాజ్ కోట్, వల్సాడ్, కచ్ ప్రాంతాల్లో 40 ఈవీఎంలు మొరాయించడంతో పాటీదార్లు ధర్నాలు చేశారు. బీజేపీ నాయకులు కావాలనే ఈ ప్రాంతాల్లో పనికిరాని ఈవీఎంలు తీసుకు వచ్చి పెట్టారని పాటీదార్లు ఆరోపించారు.
బీజేపీకి భయం
సూరత్, బోర్ బందర్, వల్సాడ్, కచ్, రాజ్ కోట్ ప్రాంతాల్లో పాటీదార్లు (పటేల్) అధిక సంఖ్యలో ఉన్నారు. బీజేపీ వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని ముందుగానే పసిగట్టిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ పని చెయ్యని ఈవీఎంలు తీసుకు వచ్చి పెట్టారని విమర్శించారు.
హార్దిక్ పటేల్ ఆందోళన
పాటీదార్ వర్గం యువనాయకుడు హార్దిక్ పటేల్ మాట్లాడుతూ సూరత్, బోర్ బందర్, రాజ్ కోట్, కచ్ తదితర ప్రాంతాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవీఎంలు మార్చాలని ఎన్నికల అధికారులకు మనవి చేశారు. ఈవీఎంలు పని చెయ్యడం లేదని తెలుసుకున్న హార్దిక్ పటేల్ ఆందోళన చెందారు.
ఎంపీ అహ్మద్ పటేల్ జోస్యం
ఈవీఎంలు పని చెయ్యలేదని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ వెంటనే ఈవీఎంలు మార్చాలని, ప్రజలకు సమస్యలు ఎదురుకాకుండా చూడాలని ఎన్నికల అధికారులకు మనవి చేస్తూ ట్వీట్ చేశారు. ఓటు హక్కు వనియోగించుకున్న అహ్మద్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ లో కాంగ్రెస్ కు 110 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
బీజేపీ నాయకురాలితో!
జనగంద్ పోలింగ్ కేంద్రం దగ్గర ఈవీఎంలు పని చెయ్యలేదని తెలుసుకున్న బీజేపీ నాయకురాలు రశ్మీ పటేల్ అక్కడికి చేరుకున్నారు. మీరు కావాలనే పనికిరాని ఈవీఎంలు తీసుకు వచ్చి పెట్టారని ఆరోపిస్తూ పాటీదార్లలోని ఓ వర్గం రశ్మీ పటేల్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.