గుజరాతీల సెంటిమెంట్: వల్సాద్లో గెలిచిన పార్టీదే పవర్!
గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ అసెంబ్లీ స్థానం ఆ రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. దీనికి కారణం ఆ స్థానంలో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి రావడమే.
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీలోని 182 స్థానాలకు గానూ వల్సాద్ నియోజకవర్గం చాలా కీలకమైనది ముఖ్యమైందీ కూడా. ఒకింత మూఢ నమ్మకం కూడా కూడగట్టుకుని ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థి ప్రాతినిధ్యం వహించిన పార్టీయే గుజరాత్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నదే సెంటిమెంట్. 1975 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2012 ఎన్నికల వరకు ఇదే మూడ విశ్వాసం, భావోద్వేగం సెంటిమెంట్గా కొనసాగుతూ వస్తోంది. 1980, 1985, 1990 ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ ఎన్నికైంది. తిరిగి 2001, 2007 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. 1975లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాల్సాద్ నియోజకవర్గం నుంచి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశవ్ రతన్జీ పటేల్ విజయం సాధించింది. భారతీయ జన్సంఘ్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1990లో తొలిసారి చిమన్ బాయి పటేల్ సారథ్యంలో సర్కార్
1980 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దోలాత్ భాయి నాథూభాయి దేశాయ్ గెలుచుకోవడంతో ఆ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం కొలువు దీరింది. 1985లోనూ ఇదే ధోరణి కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బార్జోర్జీ కవాస్జీ పార్దివాలా విజయం సాధించారు. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ అభ్యర్థి దేశాయి గెలుపొందడంతో బీజేపీ - జనతాదళ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వానికి చిమన్భాయి పటేల్ సారథ్యం వహించారు. 1995లో రెండోసారి బీజేపీ అభ్యర్థిగా దేశాయి విజయం సాధించడంతో గుజరాత్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి దోహదపడింది. బీజేపీ సీనియర్ నేత కేశుభాయి పటేల్ తొలిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1998లో గుజరాత్ అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో దేశాయి వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించడమే కాదు.. మళ్లీ కేశూభాయ్ పటేల్ ప్రభుత్వం ఏర్పాటుకు కారకులయ్యారు. మధ్యలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత, నాడు బీజేపీలో అసమ్మతి నాయకుడు శంకర్ సింఘ్ వాఘేలా కొన్నాళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు. అది వేరే సంగతనుకోండి.
గత ఎన్నికల్లో భారత్ బాయి పటేల్ ప్రాతినిధ్యం
గోద్రా అల్లర్ల తర్వాత 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాల్సాద్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగోసారి దేశాయి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 2001లో తొలిసారి బీజేపీ హస్తిన నాయకత్వం నుంచి సీఎం అభ్యర్థిగా వచ్చిన నరేంద్రమోదీ సారథ్యంలో తొలిసారి ప్రజాతీర్పు అనుకూలంగా పొందగలిగారు. గోద్రా అల్లర్లపై వివాదం చెలరేగిన నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రం అంతటా ‘అస్మిత (ఆత్మగౌరవం)' పేరుతో విస్త్రుతంగా పర్యటించి గుజరాతీల్లో భావోద్వేగాన్ని రగిల్చి మరి ఎన్నికల్లో విజయం సాధించారు. 2007లో వరుసగా ఐదోసారి దేశాయి, 2012లో భారత్ భాయి పటేల్ బీజేపీ అభ్యర్థులుగా గెలుపొందారు. 2007, 2012 ఎన్నికల్లో గణనీయ మెజారిటీతో దేశాయి, భారత్ భాయి పటేల్ విజయం సాధించడం గమనార్హం.
విజయ్ రూపానీకి ‘పాటిదార్ల' కష్టాలు
ఒకనాడు రాజ్కోట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. నూతనంగా ఏర్పాటైన బీజేపీ 1985లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిందీ.. అంతేకాదు వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఇది గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర రీజియన్లో ఉన్న స్థానం. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, కర్ణాటక గవర్నర్, ఒక రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ఇద్దరు సీఎంలను ఎన్నుకున్న చరిత్ర రాజ్ కోట్వెస్ట్ది. 2002లో తొలిసారి ప్రస్తుత ప్రధాని.. నాటి సీఎం నరేంద్రమోదీ తొలిసారి విజయం సాధిస్తే.. ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ కూడా తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజ్కోట్ వెస్ట్ స్థానంలో 75 వేల మంది పటేళ్ల ఓటర్లు ఉన్నారు. ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ సారథ్యంలో పాటిదార్లు ఉధ్రుతమైన ఆందోళన చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సారి విజయంపై ఆశలు పెంచుకున్నది. రాజ్కోట్ జిల్లా సౌరాష్ట్ర రీజియన్కు ఫైనాన్సియల్ హబ్. అంతేకాదు గుజరాతీలకే గుండెకాయ.
2012లో మోదీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా వాలా
ఎనిమిది నియోజకవర్గాలకు నిలయమైన రాజ్కోట్ వెస్ట్ అత్యున్నత ప్రొఫైల్ సీట్. చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ 1980లో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత మనిభాయి రాణ్ పరా 19,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ 1984లో సీన్ మారిపోయింది. బీజేపీ నేత వాజుభాయి వాలా విజయం సాధించి, 2002 వరకు ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2002లో సీఎంగా ఎన్నికైన మోదీ కోసం వాలా రాజీనామా చేశారు. ఆనాడు జరిగిన ఉప ఎన్నికల్లో నరేంద్రమోదీకి 45,298 ఓట్లు పొందగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని మెహతాకు 30,570 ఓట్లు లభించాయి. 2002లో జరిగిన అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో నరేంద్రమోదీ తన నియోజకవర్గాన్ని రాజ్కోట్ వెస్ట్ నుంచి మణినగర్ స్థానానికి మార్చుకోవడంతో రాజ్కోట్ నుంచి వాలా తిరిగి 2007, 2012 ఎన్నికల్లోనూ వరుసగా గెలుపొందారు. 2012లో ఆర్థిక మంత్రిగా కూడా ప్రధాని మోదీ క్యాబినెట్లో పని చేశారు.
ఆనందీబెన్ వారసుడిగా విజయ్ రూపానీ ఎన్నిక
ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాలా కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడంతో 2014లో జరిగిన ఉప ఎన్నికలో ప్రస్తుత సీఎం విజయ్ రూపానీ విజయం సాధించారు. విజయ్ రూపానీకి 81,092 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి జయంతి కత్రియాకు కేవలం 23 వేల ఓట్లు లభించాయి. 2016లో ఆనందీబెన్ పటేల్ సీఎంగా రాజీనామా చేసిన తర్వాత విజయ్ రూపానీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 42 వేల మంది కడ్వా పటేళ్లు, 33 వేల మంది లీవా పటేళ్లు, 25 వేల మంది బ్రాహ్మణులు, 25 వేల మంది లోహనాలు, 22 వేల మంది మైనారిటీలు, 20 వేల మంది బనియాలు, 10 వేల మంది క్షత్రియులు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం విజయ్ రూపానీ మళ్లీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రనీల్ రాజ్యగురు పోటీ చేస్తున్నారు.