జిఎస్టీ ఎఫెక్ట్: గుజరాత్లో బిజెపిపై నోటా దెబ్బ పడుతుందా?
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బిజెపిపై నోటా దెబ్బ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిఎస్టీతో విసిగిపోయిన కొన్ని వర్గాల ఓటర్లు నోటాను వాడుకోవచ్చునని అంటున్నారు. గుజరాత్ ఎన్నికల్లో తొలిసారి నోటాను వాడుకునే అవకాశం కల్పించారు.
2014 లోకసభ ఎన్నికల్లో 4.20 లక్షల మందికిపైగా నోటాను వాడుకున్నారు. జిఎస్టీపై అసంతృప్తితో ఉన్న కొన్ని కులాలతో పాటు లఘు, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు నోటాకు ఓటేసే అవకాశాలున్నట్లు విశ్లే,కులు భావిస్తున్నారు.
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాలకు ప్రజల మద్దతు ఉందని ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో రుజువైందని, అందువల్ల శానససభ ఎన్నికల్లో నోటా తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందనేది నిజం కాదని బిజెపి వర్గాలంటున్నాయి.
ఈవిఎంలలో 2012 శాససనభ ఎన్నికల్లో నోటా సదుపాయం లేదు. 2014 లోకసభ ఎన్నికల్లో గుజరాత్లో 4.20లక్షల మందికిపైగా ఓటర్లు నోటాపై నొక్కారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆ సమయంలో కాంగ్రెసు అధ్వాన్నమైన స్థితిలో ఉందని, మధ్య, పశ్చిమ భారతదేశంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినప్పటికీ 4.20 లక్షల మంది నోటాపై ఓటేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈసారి సామాజిక ఆర్థిక రంగాల్లో బిజెపి తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. కొన్ని కులాలు బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జిఎస్టీని ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న తీరు పట్ల లఘు, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇంతకు ముందు బిజెపిని బలపరిచిన ఈ వర్గాల నోటాను వాడుకుంటున్నాయనే ప్రచారం జరుగుతోంది..
గత ఐదేళ్ల కాలంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, బిజెపి ప్రభుత్వంతో యువత లాభపడిందని, అందువల్ల యువత బిజెపితో ఉంటుందని బిజెపి నాయకులు అంటున్నారు. కొద్ది మంది నోటాకు ఓటేసినప్పటికీ కొత్త ఓటర్లు తమ పార్టీని బలపరుస్తారని అంటున్నారు.
2014 ఎన్నికల్లో మొత్తంగా చూస్తే తమ పార్టీకి ఓట్లు పెరిగాయని బిజెపి నాయకుడొకరు అన్నారు. నోటా తమకు నష్టం చేస్తుందని అనుకోవడం లేదని అన్నారు. నోటా తమ పార్టీపైనే కాకుండా కాంగ్రెసుపై కూడా నోటా ప్రభావం పడుతుందని అన్నారు.
గుజరాత్ శాసనసభలో ఉన్న 182 స్థానాల్లో కాంగ్రెసు 78 సీట్లు గెలుస్తుందని తాజా సర్వే అంచనా వేసింది. ఈ స్థితిలో నోటా ప్రత్యామ్నాయంపై కాంగ్రెసు తన పద్ధతిని మార్చుకుంది. నోటా బిజెపి బలాన్ని తగ్గిస్తుందని ఇంతకు ముందు అంచనా వేశామని, నోటాతోనూ, బిజెపి వ్యతిరేక శక్తులు బలం పుంజుకోవడం వల్ల, బిజెపి వ్యతిరేక ఓటర్ల వల్ల తాము కొన్ని సీట్లు గెలుస్తామని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
లోకసభ ఎన్నికలతో పోల్చుకుంటే గుజరాత్లో శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 2014 లోకసభ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ మంది తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలున్నాయి.
పాటిదార్ కోటా కోసం హార్దిక్ పటేల్ నడిపిన ఉద్యమం సమీకరించే ఓట్లు గుజరాత్ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. హార్దీక్ పటేల్తో పాటు ఓబిసి నాయకుడు అల్పేష్ ఠాకూర్, దళిత నాయకుడు జగ్నేష్ మేవాని బిజెపిని వ్యతిరేకిస్తున్నారు.