ఆలస్యం ఎందుకు గురూ - బీజేపీ క్యాంప్ పాలిటిక్స్ షురూ: స్వతంత్రులతో..!!
సిమ్లా: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీకి బిగ్ డే. ప్రస్తుతం అధికారంలో ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ నెల 5వ తేదీన గుజరాత్లో రెండో దశ పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ రూపాన్ని దాల్చుతాయా? లేదా? అనేది స్పష్టం కానుంది. గుజరాత్లో మొత్తం 33 జిల్లాల్లోని 182 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 1, 5 తేదీల్లో ఎన్నికలు జరిగాయి.
ఇక్కడ జగన్ - అక్కడ పటేల్ ఆల్ టైమ్ రికార్డ్- మోదీ కూడా సాధించ లేని ఘనత అది..!!
వార్ వన్ సైడ్..
తొలి విడతలో 89, రెండో విడతలో 93 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. హిమాచల్ ప్రదేశ్లో కిందటి నెల 12వ తేదీన ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. ఈ రెండు చోట్ల కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూసుకుంటే - గుజరాత్లో ఓటర్లు వార్ వన్ సైడ్ చేశారు. మరోసారి బీజేపీపై నమ్మకాన్ని ఉంచారు. అక్కడ బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక లాంఛనప్రాయంగా మారింది.
సంఖ్యా బలానికి చేరువగా..
గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 92. దీన్ని అవలీలగా బీజేపీ అందుకుంటుందనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిమాచల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మొత్తం 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో అధికారం పొందాలంటే కావాల్సిన సంఖ్యాబలం 35.
మేజిక్ ఫిగర్కు
ఈ ఫిగర్ను అందుకోవడంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తొలి గంటలో వెనుకపడిన హస్తం పార్టీ- ఆ తరువాత దూసుకొచ్చింది. బీజేపీని వెనక్కి నెట్టింది. కాంగ్రెస్ 38, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన 35 స్థానాల కంటే కాంగ్రెస్ ఓ మూడు ఎక్కువే సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారే అవకాశం లేకపోలేదు. తక్కెడ కాంగ్రెస్ వైపే మొగ్గుతోంది.
క్యాంప్ పాలిటిక్స్..
ఈ పరిణామాల మధ్య హిమాచల్ ప్రదేశ్లో రిసార్ట్స్ రాజకీయాలు ప్రారంభం కావడానికి ఇక ఎంతో సమయం పట్టకపోవచ్చు. క్యాంప్, రిసార్ట్స్ రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరనే విషయం ఇదివరకు చాలాసార్లు ప్రూవ్ అయిన నేపథ్యంలో- హిమాచల్ ప్రదేశ్లో అదే పరిస్థితి కనిపించే అవకాశాలను కొట్టి పారేయడానికి వీల్లేదని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇండిపెండెంట్తో దేవేంద్ర ఫడ్నవిస్..
అదే సమయంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్- హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణ వైద్య చికిత్సల కోసం ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వచ్చిన హిమాచల్ ప్రదేశ్ స్వతంత్ర అభ్యర్థి హోషియార్ సింగ్ను కలుసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎనికల్లో ఆయన డెహ్రా స్థానం నుంచి పోటీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన హోషియార్ సింగ్ను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కలుసుకోవడం ఆసక్తి రేపుతోంది. దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ నాయకులు చెబుతున్నప్పటికీ- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొటాబొటిగా మెజారిటీని సాధించిన నేపథ్యంలో స్వతంత్ర్య అభ్యర్థిని కలుసుకోవడం ఆసక్తి రేపుతోంది.