నడుచుకుంటూ వెళ్లిన ప్రధాని మోదీ- అతిపెద్ద పండగగా
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది. 1వ తేదీన తొలి విడత పోలింగ్ ముగిసింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ నిలిచింది.
14 జిల్లాల్లో..
గుజరాత్లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ ఇదివరకే ముగిసింది. దక్షిణ గుజరాత్, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు ఇవ్వాళ పోలింగ్ జరుగనుంది. సెంట్రల్, నార్త్ గుజరాత్లల్లో గల 14 జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
రెండో విడతలో..
రెండో దశలో పోలింగ్ జరుగనున్న 93 స్థానాల్లో మొత్తం 833 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 69 మంది మహిళల, 285 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపారు. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన మూడింటిని తన మిత్రపక్షం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. బహుజన్ సమాజ్ పార్టీ-44, భారతీయ ట్రైబల్ పార్టీ-12 చోట్ల పోటీ చేస్తోంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగనుంది.
నడుచుకుంటూ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ రణిప్ ప్రాంతంలో గల నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు- ఆయన ఈ ఉదయం 8:40 నిమిషాలకు గాంధీనగర్లోని రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్కు బయలుదేరి వచ్చారు. రణిప్ ప్రాంతంలో కారుదిగిన ఆయన పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వెళ్లారు.
అందరూ భాగస్వామ్యం కావాలి..
పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ వెంటనే ఆయన ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అతిపెద్ద పడంగ అని, ఇందులో ప్రతి ఒక్క ఓటర్ భాగస్వామి కావాలని అన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు వల్ల ప్రజాస్వామ్యం బలోపేతమౌతుందని పేర్కొన్నారు.
ఓటు వేసిన సీఎం..
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. అహ్మదాబాద్ శిలాజ్ అనుపమ్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఘట్లోడియా స్థానం నుంచి పోటీలో ఉన్నారు. కాగా- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఉదయం 10:30 గంటలకు ఓటు వేయనున్నారు. అహ్మదాబాద్ నరన్పురా మున్సిపల్ సబ్ జోనల్ ఆఫీస్ పోలింగ్ బూత్లో ఓటు వేయనున్నారాయన.