గుజరాత్లో ఇదీ పరిస్థితి: బీజేపీకి 'టఫ్ టైమ్'.., వ్యాపార వర్గాలు ఏమంటున్నాయంటే?..
Recommended Video
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. బీజేపీ తీసుకొచ్చిన జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు, ఆధార్ కార్డు లింకు వంటి విధానాలు సాధారణ వ్యాపారులను గందరగోళపరుస్తున్నాయి.
ఈ విధానాలు తమ వ్యాపారాలకు తీవ్ర ప్రతిబంధకంగా మారడంతో అక్కడి వ్యాపారులు బీజేపీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉండటంతో.. సహజంగానే ఆ వ్యతిరేకత కూడా కొంత తోడైంది.
మరోవైపు జిగ్నేష్ మేవాని, హార్థిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ లాంటి యువ కిశోరాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగడంతో.. ఆ పార్టీ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి.
సామాన్యుడిలో అసంతృప్తి
బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన ఆర్థిక విధానాలు గుజరాత్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయంటున్నారు. అహ్మదాబాద్ స్థానికుల మాటల్లోనూ ఇదే వ్యక్తమవుతోంది. కూరగాయాల రేట్లు పెరిగిపోయాయి, గ్యాస్ ధర రూ.700 దాటింది, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి.. జీఎస్టీ దెబ్బకు వచ్చే సంపాదన కూడా కుటుంబ పోషణకు సరిపోవడం లేదని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. ఒకరకంగా ఎంత కష్టపడ్డా ఏమి మిగలని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు.
వాటితో గందరగోళం:
ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డుతో లింకు పెట్టడం, ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలనడం, డిజిటల్ చెల్లింపులు, ఇవన్నీ సామాన్యులను గందరగోళంలోకి నెడుతున్నట్లు గుజరాత్ ప్రజలు చెబుతున్నారు. ఆఖరికి ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన సబ్సిడీలు కూడా వీటి కారణంగా అందకుండా పోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పడిపోయిన వ్యాపారాలు:
మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తమ వ్యాపారాలు ఢీలా పడ్డాయని అహ్మదాబాద్ ఆశ్రమ్ రోడ్డులో ఉన్న ఖాదీ భాండార్ల యజమానులు చెబుతున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు.
ఆశ్రమ్ రోడ్డు, ఢోక్లా, విరాంగం, మెయిన్ బజార్, దంఢూకా, సనద్ ప్రాంతాల్లో వ్యాపారులు, చిన్న దుకాణ దారులు, రోజు కూలీలు, పాన్ డబ్బా యజమానులు, ఆటో డ్రైవర్లు ఇలా చాలామంది బీజేపీపై బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రానికి మారుతి, టాటా, హోండా లాంటి కంపెనీలు వచ్చినా.. వాటిల్లో స్థానికేతరులకే ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయని అంటున్నారు.
కాంగ్రెస్ బలపడే అవకాశం:
2012 గుజరాత్ సార్వత్రిక ఎన్నికల్లో అహ్మదాబాద్ పరిధిలోని 21 సీట్లలో బీజేపీ 17 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ నాలుగు సీట్లు దక్కించుకోగా.. ఒకరు పార్టీ ఫిరాయించారు. కానీ ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.
అదే సమయంలో మోడీ-అమిత్ షా ద్వయం బీజేపీని మళ్లీ నిలబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేవారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఈ ఎన్నికలు బీజేపీ మెడ మీద కత్తిలాగే మారాయి.