భారత్ లోకి ఐసిస్ ఉగ్రవాదులు! ఆందోళనలో ప్రభుత్వం, విమానాశ్రయాల్లో నిఘా పెంపు!
సిరియాలోని రక్కానుంచి పారిపోయిన విదేశీ ఉగ్రవాదులు (ఎఫ్టీఎఫ్లు) వారి సొంత దేశాలకు పయనమవుతున్నట్టు భద్రతా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.
న్యూఢిల్లీ: సిరియాలోని రక్కానుంచి పారిపోయిన విదేశీ ఉగ్రవాదులు (ఎఫ్టీఎఫ్లు) వారి సొంత దేశాలకు పయనమవుతున్నట్టు భద్రతా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఐసిస్ ఉగ్రవాదుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నారని కౌంటర్ టెర్రరిజం అధికారులు పేర్కొన్నారు.
జీహాదీలకు సెక్స్ బానిసల ఎర, ఉత్తేజం కోసం విశృంఖల ధోరణులు...
2014కు ముందు వీరంతా ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లినట్టు చెబుతున్నారు. అయా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల సామ్రాజ్యం కూలిపోవడంతో భారత్ నుంచి వెళ్లి చేరిన వారంతా తిరిగి భారత్ వచ్చేందుకు పథక రచన చేస్తునట్టు తెలుస్తోంది.
ఐసిస్ ఉగ్రవాదుల పలాయనం...
సిరియాలోని రక్కాను రాజధానిగా చేసుకుని ప్రపంచ విధ్వంసానికి పూనుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఇటీవల అక్కడి ప్రభుత్వ దళాలు తరిమికొట్టి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. సైనిక దళాల ఎదురుదాడికి తాళలేక కొందరు ఉగ్రవాదులు పలాయనం చిత్తగించగా మరికొందరు లొంగిపోయారు. ఈ పోరులో వందలాది మంది మరణించారు. ఉగ్రవాదుల చెర నుంచి రక్కాకు విముక్తి లభించినా ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఐసిస్ ఉగ్రవాదుల భయం పట్టుకుంది.
భారత్ నుంచి వెళ్లిన వారు తిరిగి వెనక్కి...
ఇటీవల టర్కీ నుంచి భారత్కు వచ్చిన కేరళకు చెందిన ఐసిస్ అనుమానితులు అబ్దుల్ రజాక్, మిదిలాజ్, ఎంవీ రషీద్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ నుంచి ఐసిస్ లోకి వెళ్లిన పలువురు అయా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదుల సామ్రాజ్యం కూలిపోవడంతో ఇప్పుడు తిరిగి భారత్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వానికి నిఘా సంస్థల సూచన...
ఈ నేపథ్యంలో దేశ సరిహద్దులలో, విమానాశ్రయాలలో నిఘా పెంచాలని నిఘా సంస్థలు ప్రభుత్వానికి సూచించాయి. అలాగే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని అనుమానిత భారతీయులపై కూడా దృష్టి పెట్టాలని సూచించాయి. తప్పుడు పాస్పోర్టులతో భారత్ రావాలనుకునే వారిపై నిఘా పెంచాలని ఆయా దేశాలకు నిఘా సంస్థలు సూచించాయి. ఇంటర్పోల్ సాయంతో 40 వేల మంది విదేశీ ఉగ్రవాదుల డేటా బేస్ను అధికారులు పరిశీలిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విధ్వంస కుట్ర...
గుజరాత్ లోని సూరత్ ప్రాంతంలో మారణహోమం సృష్టించే పనిలో నిమగ్నమైన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న గుజరాత్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి సాధ్యమైనంత ఎక్కువ ప్రాణనష్టాన్ని కలిగించాలన్న లక్ష్యంతో వీరు గుజరాత్ లో తిష్ఠవేసినట్లు సమాచారం. ఎన్నికలను అడ్డుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశమని ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.