కలకలం: కదులుతున్న రైలులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే హత్య
అహ్మదాబాద్ : కదులుతున్న రైలులో బీజేపీనేత మాజీ ఎమ్మెల్యే హత్యకు గురైన విషయం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకెళితే... బీజేపీ నేత గుజరాత్లోని అబ్దాసా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జయంతి భనుషాలిని కొందరు గుర్తుతెలియని దుండుగుల కదులుతున్న రైలులో కాల్చి చంపారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
సయాజీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న జయంతి భనుషాలిని ఛాతీలోకి ఓ బుల్లెట్, మరో బులెట్ ఆయన తలలోకి దూసుకుపోవడాన్ని పోలీసులు గమనించారు. అంతేకాదు ఆయన శరీరంపై లైసెన్స్ కలిగిన తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బులెట్లు అతని శరీరంలోకి చొచ్చుకుపోవడాన్ని చూస్తే అది ఆత్మహత్య కాదని హత్యే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే భనుషాలి కుటుంబ సభ్యులు ఈ హత్య వెనక మరో బీజేపీ నేత చాబిల్ పటేల్ హస్తం ఉందని ఆరోపించారు.
ఇక భనుషాలి హత్య పై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పారు. పశ్చిమ భారతీయ రైల్వేలు ఘటనపై సిట్ను ఏర్పాటు చేసింది. సోమవారం రాత్రి 10:25 గంటలకు రైలు బయలు దేరిందని... అర్థరాత్రి అంటే మంగళవారం తెల్లవారు జామున 1:25 గంటలకు బోగీలో భనుషాలి మృతదేహంను కనుగొన్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. గతేడాది భనుషాలిపై అత్యాచార ఆరోపణలు రావడంతో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయనపై అత్యాచారం ఆరోపణలు చేసి ఫిర్యాదు చేసిన మహిళ గుజరాత్ హైకోర్టు నుంచి పిటిషన్ను విత్డ్రా చేసుకుంది.
ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాబిల్ పటేల్ కూడా 2014లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి రావడం ఆ తర్వాత తన ఓటమికి భనుషాలి కారణం అని చెప్పడంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఒకే పార్టీలో ఇద్దరూ ఉన్నా... ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు.