నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదన
సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, కేంద్ర మంత్రిగానూ పని చేసి, ప్రస్తుతం గుజరాత్ నుంచి ఎంపీగా ఉన్న మన్సుఖ్ భాయి వాసవ పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించారు. గుజరాత్లోని భరూచ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వాసవ.. నర్మదా జిల్లాలోని రైతాంగానికి మేలు చేయబోయి, సొంత పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. ప్రధాని మోదీకి ఆయన రాసిన లేఖపై ఎంతకూ సమాధానం రాకపోవడంతో విరక్తి చెంది అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ
లేఖ కలకలం
బీజేపీని వీడుతున్నట్లు ఎంపీ మన్సుఖ్ భాయి వాసవ మంగళవారం బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్కు లేఖ రాశారు. ఆరు సార్లు లోక్సభకు ఎన్నికైన వాసవ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. భరూచ్ నియోజకవర్గంలో 1998 ఉప ఎన్నికతో కలిపి మొత్తం ఆరు సార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన పార్టీకి, పదవికి రాజీనామా నేపథ్యంలో రాసిన లేఖ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
నేనొక మనిషిని.. తెలిసో తెలియకో..
‘‘ఎంతోకాలంగా పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాను. పార్టీ విలువలు, విధానాలను కాపాడేందుకు ప్రయత్నించాను. అయితే, అన్నింటికి మించి నేనో మనిషిని. తెలిసో తెలియకో మనిషి తప్పులు చేసుండొచ్చు. నా తప్పుల వల్ల గొప్పదైన పార్టీకి నష్టం వాటిల్లొద్దనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నాను. పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా వదులుకుంటాను. బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ను వ్యక్తిగతంగా కలిసి నా రాజీనామా లేఖను అందజేస్తాను. నా నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియపరచండి'' అని వాసవ లేఖలో పేర్కొన్నారు.
నర్మదా రైతుల కోసం వినతి..
వాసవ లేవనెత్తుతున్న సమస్యలపై పార్టీ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భాజపా పనితీరుపైనా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలి తన నియోజకవర్గంలో పలు సమస్యలపైనా గళమెత్తారు. దీంతో పాటు గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నర్మదా జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్లుగా ప్రకటించే నోటిఫికేషన్ను ఉపసంహరించుకొనేలా పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కానీ ప్రధాని ఆ విషయాన్ని పట్టించుకోలేదు. వాసవ రాజీనామా అంశంపై బీజేపీ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా స్పందించారు. ఆయనో సీనియర్ ఎంపీ అని, వాసవ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
సీఎంగా వైఎస్ జగన్ అరుదైన ఘనత -దేశంలోనే తొలి వ్యక్తి -అపరిచితుడు కూడా: విష్ణుకుమార్ రాజు