దిమ్మ తిరిగింది: 2 కోట్లు విలువ చేసే కారుపై 27 లక్షలు భారీ జరిమానా..ఎలా అంటారా..?
గుజరాత్లో ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అత్యంత ఖరీదైన పోర్షే కారుకు యజమాని అయిన ఆ వ్యక్తి ఆ కాస్లీ కారును ఏం పట్టుకుంటారులే అని భావించాడు. చాలా ఈజీగా తీసుకున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ వ్యక్తికి భారీ జరిమానా విధించారు. విధించని జరిమానా ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత భారీ జరిమానాగా రికార్డు క్రియేట్ చేసిందని అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
రూ.2.38 కోట్లు విలువ చేసే పోర్షే కారు
ఒక నెల రోజుల క్రితం అత్యంత ఖరీదైన పోర్షే 911 మోడల్ కారును అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. దీని యజమాని వ్యాపారవేత్త రంజిత్ దేశాయ్గా గుర్తించారు. ఆ కారు ఖరీదు రూ.2.38 కోట్లు. అయితే రోజువారీ తనిఖీల్లో భాగంగా ఆ కారును పోలీసులు పట్టుకున్నారు. ఇక కారుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు అడుగగా అలాంటివేమీ తన దగ్గర లేవన్నాడు రంజిత్. అంతేకాదు కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఆ సమయంలో రూ.9 లక్షలు జరిమానా విధించారు.
కొసరు రూ.9 లక్షలు అసలు చూస్తే...
రూ.9 లక్షలు మాత్రమే జరిమానాగా విధించగా ఆ తర్వాత అప్పటికే కారుపై పెండింగ్లో ఉన్న జరిమానా రూ.12 లక్షలుగా ఉన్నింది. దీనికి తోడు రంజిత్ దేశాయ్ రోడ్ ట్యాక్స్ కట్టలేదు, రిజిస్ట్రేషన్ చేయించలేదు. దీనిపై కూడా జరిమానా విధించడం జరిగింది. కారును దిగుమతి చేసుకున్నప్పటి నుంచి ఇవేమీ కట్టకుండా రోడ్డుపై కారును దర్జాగా తిప్పుతున్నాడు. ఖరీదైన కారును ట్రాఫిక్ పోలీసులు పట్టుకోరులే అన్న ఒక్క ధైర్యంతో ఇన్నాళ్లు కారును తిప్పాడు. కానీ అందరూ ఒకలా ఉండరని గ్రహించుకోలేకపోయాడు రంజిత్ దేశాయ్.
పోర్షే కారును సీజ్ చేసి స్టేషన్కు తరలింపు
ఒక్కసారిగా కారును పట్టుకోవడంతో షాక్ తిన్నాడు రంజిత్ దేశాయ్. అప్పటికే పెండింగ్లో భారీ జరిమానా ఉండటంతో పోలీసులు పోర్షే కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అన్ని చలాన్లు కట్టి, వెహికల్ రిజిస్ట్రేషన్ ఇతర డాక్యుమెంట్లు చూపించాకే కారును తీసుకెళ్లాల్సిందిగా ట్రాఫిక్ డీసీపీ అజిత్ రాజన్ చెప్పారు. ఇక రూ.2 కోట్లు పెట్టి ఖరీదు చేసిన కారు కోసం అన్ని జరిమానాలు కట్టాడు. మొత్తంగా రంజిత్ దేశాయ్ కట్టిన జరిమానా రూ.27.68 లక్షలు. జరిమానా కట్టిన తర్వాత కారును తిరిగి పొందాడు. కారును నవంబర్లో సీజ్ చేయడం జరిగింది.
చలాన్ను ట్వీట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు
ఇక అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఓ రశీదును ట్విటర్లో పోస్టు చేశారు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత భారీ జరిమానా (రూ. 27.68లక్షలు) విధించడం జరిగిందని ట్విటర్లో రాసుకొచ్చారు. నవంబర్ 28న హెల్మెట్ క్రాస్రోడ్లో ఈ ఖరీదైన పోర్షే కారును పట్టుకున్నట్లు చెప్పారు. దీనికి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పట్టుకున్నామని చెప్పారు. ముందుగా రూ.9.8లక్షలు విధించడం జరిగిందని ఈ డబ్బులను కట్టేందుకు ఆర్టీఓ ఆఫీసుకు రంజిత్ దేశాయ్ వెళ్లగా కారుకు సంబంధించిన పాత రికార్డులను వెలికి తీయగా జరిమానా మొత్తం రే.27.68 లక్షలుగా తేలినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి ఆ డబ్బులను చెల్లించి కారును తీసుకున్నట్లు చెప్పారు.