గుజరాత్లో ఆమ్ ఆద్మీ,ఎంఐఎం పాగా...మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు..ఎవరికెన్ని సీట్లంటే.
గుజరాత్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. సూరత్ కార్పోరేషన్లో ఆ పార్టీ 27 వార్డులను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 120 వార్డులు ఉన్న సూరత్లో బీజేపీ 93 గెలవగా,ఆమ్ ఆద్మీ 27 వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ సున్నాకు పరిమితమైంది. అయితే సూరత్ మినహా మరే మున్సిపల్ కార్పోరేషన్లోనూ ఆమ్ ఆద్మీ ఖాతా తెరవలేదు. అదే సమయంలో ఆయా కార్పోరేషన్లలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
అహ్మదాబాద్లో సత్తా చాటిన ఎంఐఎం
ఈ నెల 21న గుజరాత్లోని అహ్మదాబాద్,సూరత్,వడోదరా,రాజ్కోట్,జామానగర్,భావనగర్ మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు మున్సిపల్ కార్పోరేషన్లలో కాంగ్రెస్కు గతం కన్నా సీట్లు తగ్గాయి. సూరత్లో కాంగ్రెస్ స్థానాన్ని ఏకంగా ఆమ్ ఆద్మీ ఆక్రమించేసింది. మొత్తం ఆరు మున్సిపల్ కార్పోరేషన్లలో కలిపి 575 వార్డులకు గాను బీజేపీ 463 వార్డుల్లో గెలుపొందగా... కాంగ్రెస్ 44,ఆమ్ ఆద్మీ 27 వార్డుల్లో గెలుపొందింది. బహుజన్ సమాజ్ పార్టీ జామానగర్లో 3 వార్డులు గెలుచుకుంది. అహ్మదాబాద్ మున్సిపోల్స్లో ఎంఐఎం సత్తా చాటడం విశేషం. 21 వార్డుల్లో పోటీ చేసిన ఎంఐఎం 7 వార్డుల్లో విజయం సాధించింది. గతంలో ఈ వార్డులన్నీ కాంగ్రెస్వి కావడమే గమనార్హం.
ఆమ్ ఆద్మీ పార్టీకి బూస్టింగ్...
గుజరాత్లో ఆమ్ ఆద్మీకి లభించిన సీట్లపై ఆ పార్టీ అధినేత,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫిబ్రవరి 26న ఆయన సూరత్లో పర్యటించనున్నారు. సూరత్లో ఆమ్ ఆద్మీకి ఈ విజయం లభించడం వెనుక ఆ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆమ్ ఆద్మీ విజయంతో గుజరాత్ ప్రజలు కూడా ఢిల్లీ తరహా పాలన కోరుకుంటున్నారని స్పష్టమవుతోందన్నారు. ఇదే స్పూర్తితో 2022 ఎన్నికలకు సిద్దమవుతామని చెప్పారు.
బీజేపీ అభివృద్దికి పట్టం : అమిత్ షా
మున్సిపల్ కార్పోరేషన్ ఫలితాలపై కేంద్రమంత్రి అమిత్ షా ట్విట్టర్లో స్పందించారు. గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీ చేస్తున్న అభివృద్ది,ప్రగతి పట్ల విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్లకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పేద ప్రజలు,వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ అవలంభిస్తున్న విధానాలకు,నిజాయితీకి ప్రజలు ఈ విజయం కట్టబెట్టారని అభిప్రాయపడ్డారు.