ఉగ్రవాదులకు ముస్లిం టోపీలు: ఓ మతానికి ఆపాదించడం తగదు, సీఎం క్షమాపణ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు దాడులపై చైతన్యం కలిగించేందుకు సూరత్ పోలీసులు చేసిన మాక్ డ్రిల్ విమర్శలకు తావివ్వడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ క్షమాపణలు తెలిపారు. మాక్డ్రిల్లో పోలీసులు ప్రదర్శించిన తీరును తప్పుగా ఆనందిబెన్ అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని ఓ మతానికి ఆపాదించడం తగదని ఆమె అన్నారు.
వివరాల్లోకి వెళితే... గుజరాత్లోని సూరత్ పోలీసులు ఓల్పాడ్కు సమీపంలోని దాభేరి వద్ద ఉగ్రవాదులు విరుచుకు పడ్డట్టు ప్రజలకు భ్రమ కల్పించారు. టెర్రరిస్టులను చంపేసి వారి వద్ద నుండి మొబైల్స్, ఆయుధాలను పోలీసులు (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదులు దాడి చేస్తే ప్రజలు ఏవిధంగా వ్వవహరించాలన్న విషయంలో చైతన్యం చేయాలని పోలీసు భావించి ఒకేసారి 10 చోట్ల మాక్ డ్రిల్ తలపెట్టారు. ఈ మాక్ డ్రిల్లో వీరి తలలపై ముస్లింలు వాడే తెల్ల టోపీలను ఉంచడం విమర్శలకు తావిచ్చింది. ముస్లింలు ఉగ్రవాదులు అనే అర్థం వచ్చేలా పోలీసులు వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది.
దీంతో రంగంలోకి దిగిన బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ విషయంపై గుజరాత్ బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ నిజమైన టెర్రరిస్టులు కూడా తెల్ల టోపీలను ధరించి రారు. ఒక మతాన్ని సూచికగా పోలీసులు ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించి ఉండకూడదని అన్నారు.
ఐతే... స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్స్పెక్టర్ బీసీ థక్కుర్ ఈ మాక్ డ్రిల్లో తెల్ల టోపీలు ఓ విధమైన లుక్ కోసమే వాడామని అన్నారు. ఏ మతాన్ని కూడా ఉగ్రవాదున్ని ఆపాదించడం తమ ఉద్దేశ్యం కాదని చెప్పారు. ఇక, తాము ఒకేసారి పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించమని ఒక్కోచోట ఒక్కోరకంగా ఉగ్రవాదులు ఉంటారని, ఇలా జరిగి ఉండకూడదని సూరత్ డీఎస్పీ ప్రదీప్ సేజుల్ తెలిపారు.
ముస్లిం టోపీలు ధరించిన వారిని టెర్రిరిస్టులుగా చిత్రీకరిస్తూ బుధవారం రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యాక్రమం వివాదాస్పదం కాగా తాజాగా గురువారం అలాంటిదే మరో వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది.
నర్మదా జిల్లాలోని కెవాడీయా సమీపంలో ఇద్దరు డమ్మీ ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నట్టు తాజా వీడియోలో చిత్రీకరించారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ తీసిన వీడియో మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని, ఆ సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నర్మదా ఎస్పీ జయ్పాల్సింగ్ రాథోడ్ తెలిపారు.
పోలీసుల సాధారణ కార్యక్రమాల్లో భాగంగానే కెవాడియా ప్రాంతంలో మాక్డ్రిల్ను నిర్వహించామని ఆయన తెలిపారు. ఉగ్రవాదుల దాడులు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుపడానికే ఆ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.