పైశాచికం: అయిదు రోజుల పసికందుకు చిత్రవధ: శరీరంపై 20 కత్తిపోట్లు: ప్రాణాపాయ స్థితిలో..!
అహ్మదాబాద్: గుజరాత్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అయిదు రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు చిత్రవధకు గురి చేశారు. ఆ పసిగుడ్డు శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నాయంటే ఆ దుండగులు ఏ స్థాయిలో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి విజయ్ రుపాణి ఆసుపత్రికి వెళ్లారు.
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజ్కోట్ సమీపంలోని ఓ గ్రామం వెలుపల పొదల్లో ఆదివారం ఉదయం ఆ పసికందును గుర్తించారు స్థానికులు. వీధి కుక్కలు చుట్టు ముట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు దగ్గరికి వెళ్లి చూడగా.. రక్తమోడుతున్న శరీరంతో కనిపించిందా చిన్నారి. వెంటనే ఆ పాపను రాజ్కోట్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి విజయ్ రుపాణి, జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వెళ్లారు.
పాప వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అంబే (అమ్మోరు) అని నామకరణం చేశారు. చిన్నారికి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. పాప ప్రాణాపాయ స్థితిలో ఉందని డాక్టర్లు వెల్లడించారు. వెంటిలేటర్పై ఉంచామని చెప్పారు. అత్యాధునికమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం విజయ్ రుపాణి జిల్లా పోలీసు సూపరింటెండెంట్తో మాట్లాడారు. పాప లభించిన గ్రామాన్ని సందర్శించాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారెవరో గుర్తించాలని సూచించారు. తల్లిదండ్రులు ఎవరనేది తెలుసుకోవాలని చెప్పారు.