కాన్వాయ్ ఆపి మరీ రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన సీఎం
తాను వెళుతున్న మార్గంలో రోడ్డు ప్రమాద బాధితులను చూసిన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన కాన్వాయ్ ను ఆపించి బాధితులను స్వయంగా కాపాడారు.
గాంధీనగర్: ఆయన సాక్షాత్తు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సాధారణంగా ముఖ్యమంత్రి ఎక్కడికైనా బయల్దేరారంటే.. ఇక అధికారులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ను ముందుగానే నిలిపివేస్తారు.
జనమంతా చూస్తుండగా ముందు నాలుగు, వెనక నాలుగు వాహనాలతో సీఎం కాన్వాయ్ రయ్.. రయ్ న దూసుకుపోతుంటుంది. ఒకసారి కాన్వాయ్ కదిలిందంటే.. మధ్యలో ఎక్కడా ఆగే ప్రసక్తే ఉండదు. సీఎం కదా.. మరి యమ బిజీగా ఉంటారు.
అయితే అందరు సీఎంల సంగతేమోగానీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని మాత్రం అలాకాదు. తాను వెళుతున్న మార్గంలో రోడ్డు ప్రమాద బాధితులను చూసిన ఆయన.. తన కాన్వాయ్ ను ఆపించి బాధితులను స్వయంగా కాపాడారు. క్షతగాత్రులను దగ్గరుండి మరీ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స చేసే వరకు ఉన్నారు.
గుజరాత్ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నూతన భవన ఆవిష్కరణ ముగించుకొని తిరిగి గాంధీనగర్ వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్లోని కోబా సర్కిల్లో ఓ ఆటో రిక్షా ప్రమాదానికి గురవగా.. అదే సమయంలో అటుగా వెళుతున్న సీఎం విజయ్రూపాని రోడ్డు ప్రమాదంలో గాయపడిన నలుగురు మహిళలను గమనించారు.
వెంటనే ఆయన తన కాన్వాయ్ను ఆపి ఒక కారులో ఆ నలుగురు మహిళలను ఎక్కించుకున్నారు. వారిని వెంటనే గాంధీనగర్లోని సివిల్ ఆసుపత్రిలో చేర్పించడమే కాక దగ్గరుండి మరీ చికిత్స చేయించారు. క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేసి మనసున్న సీఎం అని నిరూపించుకున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగితే చూస్తూ మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్లే వాళ్లు సాధారణంగా కనిపిస్తూనే ఉంటారు. కానీ ఓ రాష్ట్రానికి సీఎం అయి ఉండీ.. తన భద్రతను పక్కన పెట్టి మరీ.. మానవత్వం ప్రదర్శించిన ఈ సీఎంను యావత్ జాతి అభినందించాల్సిందే!