ఆనందీబెన్ రాజీనామా: ఇవే కారణం, బీజేపీకి చిక్కులేనా?
అహ్మదాబాద్: ఆనందీబెన్ పటేల్ బుధవారం నాడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కోహ్లీకి ఇచ్చారు. ఆమె రాజీనామా నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ కొనసాగుతోంది.
తనకు త్వరలో డెబ్బై అయిదు సంవత్సరాల వయస్సు ఉన్నందున రాజీనామాకు అనుమతివ్వాలని ఆనందీ బెన్ పార్డీ అధిష్టానాన్ని కోరిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించింది. దీంతో ఆమె తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు.
ఆనంది రాజీనామా నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో పలువురు ఉన్నారు. ఆరోగ్య మంత్రి నితిన్ భాయ్ పటేల్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ రూపానీ, కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాల, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భిక్షూభాయ్ దాల్సానియా, గిరిజనుడు అయిన శాసనసభ స్పీకర్ గణ్పత్ వాసవ ఉన్నారు.
కలకలం: ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా!
బీజేపీకి కంచుకోట అయిన గుజరాత్లో ప్రస్తుతం పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన, గోరక్ష పేరుతో దళితులపై చేసిన దాడుల పట్ల నిరసన ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. వీటి వల్లే ఆనందీ రాజీనామా చేశారని అంటున్నారు. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే నేత ఇప్పుడు ఆ రాష్ట్రానికి కావాలి.
ఇదిలా ఉండగా, గుజరాత్ ముఖ్యమంత్రి అనందీబెన్ అనుచరులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆగ్రహంగా ఉన్నారు. ఆమె రాజీనామా వెనుక ఆయన ఉన్నారనే పుకార్లు కూడా వచ్చాయి.
గత కొద్ది కాలంగా ఆమె పనితీరుపై బీజేపీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన పాటీదార్ రిజర్వేషన్ల ఆందోళన, ఉనా పట్టణంలో దళితులపై దాడి సంఘటనల్లో ఆమె వైఫల్యం చెందినట్టు పార్టీ నాయకత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గాల్లో ఒకటైన పటేల్లు బీజేపీ వైపు ఉండటం పార్టీకి అనుకూలించింది. అయితే తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతూ హర్దిక్ పటేల్ నేతృత్వంలో జరిగిన ఆందోళన రాష్ట్రాన్ని కుదిపివేసింది. అనేక ప్రాంతాల్లో హింసాత్మకచర్యలు చోటు చేసుకున్నాయి.
బీజేపీకి కీలకమైన పటేల్ల ఆందోళనను నియంత్రించడంలో ఆనందీ విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవలే ఉనా పట్టణంలో కొందరు గోసంరక్షకుల పేరుతో దళితులపై దాడి చేయడం దేశవ్యాప్తంగా దళితవర్గాల్లో ఆందోళకు కారణమైంది. కాగా, ఆనందీ బెన్ రాజీనామా.. రెండు దశాబ్దాలుగా గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి చిక్కులేనని అంటున్నారు.