సిద్ధూ మాత్రమే మినహాయింపు: అహ్మద్ పటేల్కు సంకటం.. సోనియాకు సవాల్
2014లో ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుత పంజాబ్ మంత్రి నవ్జ్యోతి సిద్ధూ మినహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఆధిపత్య రాజకీయాల వైపు మొగ్గుతున్నారు. \
బెంగళూరు: 2014లో ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుత పంజాబ్ మంత్రి నవ్జ్యోతి సిద్ధూ మినహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఆధిపత్య రాజకీయాల వైపు మొగ్గుతున్నారు. వారంతా ప్రత్యేకించి బీజేపీలో చేరడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కమలనాథులు కూడా దేశమంతటా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అలా బీజేపీలో చేరేవారంతా ఆ పార్టీకి గొప్ప విజయాలు తెచ్చి పెట్టకపోయినా ప్రత్యర్థి పార్టీల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇది ప్రత్యర్థులకు పదేపదే ఓటములను మిగులుస్తుండగా, బీజేపీకి వరుస విజయాలను తెచ్చి పెడుతోంది.
గుజరాత్ రాష్ట్రంలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బల్వంత్ సింగ్ రాజ్ పుత్, తేజశ్రీ పటేల్, పీ పటేల్ రాజీనామా చేయడం ఈ కోవలోకే వస్తుంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ ఎమ్మెల్యేలందరినీ శిబిరాలకు తరలించింది.
అహ్మద్ పటేల్ ఓడిపోతే.. సోనియాకు సంక్లిష్టమే
దీనికి కారణం గుజరాత్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి! రాజ్యసభ ఎన్నికలకు కూడా క్యాంపు రాజకీయాలా!? అని ఆశ్చర్యపోకండి! వచ్చేనెల 18వ తేదీన గుజరాత్లో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం రెండు బీజేపీకి, ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలకూ అదీ కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ను ఓడించాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కంకణం కట్టుకోవడమే ఇందుకు కారణం. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ కోలుకోలేని దెబ్బగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇలా కాంగ్రెస్ పార్టీలో నరాలు తెగే ఉత్కంఠ
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం ఖరారైంది. కానీ, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ వంటి దిగ్గజాన్ని ఓడించి మూడో సీటును కూడా కైవసం చేసుకోవాలని బీజేపీ పావులు కదిపింది. అందుకోసం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో చీఫ్విప్గా ఉన్న బల్వంత్ సింగ్ రాజ్పుత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అహ్మద్ పటేల్ అవకాశాలకు గండి కొట్టేందుకు బీజేపీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నరాలు తెగే ఉత్కంఠ పెంచుతున్నది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ సీఎం శంకర్ సింఘ్ వాఘేలాకు బావమరిది. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్సింగ్ వాఘేలా పార్టీని వీడేలా చేసింది. ఆయన తర్వాత మరో ఐదుగురు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. వారిలో ముగ్గురు బీజేపీలో చేరారు. ఇంకో ఏడుగురు ఎమ్మెల్యేల సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. ఇక, మొత్తం 57 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆ పార్టీకి మిగిలింది 44 మంది. దాంతో వారందరినీ బెంగళూరు తరలించింది. తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్కు చెందిన రిసార్టులో ఉంచింది.
రిసార్ట్ పాలిటిక్స్పై ఇలా స్వామి
గుజరాత్ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే సుమారు 46 ఓట్లు కావాలి. బీజేపీకి 121 మంది సభ్యులు ఉన్నారు. మూడో సీటు దక్కించుకోవాలంటే ఆ పార్టీకి మరో 17 ఎమ్మెల్యేల బలం కావాలి. ఆగస్టు 8న జరిగే రాజ్యసభ ఎన్నికల పోలింగ్ వరకూ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోనే గడపనున్నారు. వారు రిసార్టు దాటి బయటకు వెళ్లకుండా చేశారు. చివరకు మొబైల్ ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా చేశారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డి వేటలో ఉన్న పశువులని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. ‘‘వాళ్లు పశువులు. వాళ్లను పంజరంలో బంధించారు. వాళ్లకు అవసరమైన దాణాను బీజేపీ మాత్రమే అందించగలదు'' అని వ్యాఖ్యానించారు. దాణా అంటే ఏమిటో అదే సుబ్రమణ్య స్వామి స్వయంగా వివరిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాజకీయాలు చేసినా ట్రిక్కులు ప్రయోగించినా రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ఓటమి పాలవ్వడం ఖాయమని బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలపై సీఎం విజయ్ రూపాలా ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో అదే కూలిపోతుందని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని తెలుసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ట్వీట్ చేశారు. తమ లక్ష్యం ప్రస్తుతం వరదల సహాయ చర్యలు చేపట్టమే అని తెలిపారు. కాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రిసార్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విశ్రాంతి పొందుతున్నారని ఆరోపించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడమే తమకు ప్రాధాన్యం, కాంగ్రెస్ పార్టీ వారికి తమాషాగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రజలే తుది నిర్ణేతలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తమకేం సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. కానీ బెంగళూరుకు తరలించిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు గోవా రాబారి, ధార్షిభాయి ఖాన్పూరా, మహేశ్ పటేల్ తిరిగి తమ నియోజకవర్గాలకు వెళ్లిపోవాలని నస పెడుతున్నారని సమాచారం. ఇటీవలి తుఫాన్ వల్ల దెబ్బ తిన్న తమ నియోజకవర్గ ప్రజలకు సాయం చేయాలని వదిలి పెట్టాలని కోరుతున్నారట. దీంతో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు సెల్ ఫోన్ల వినియోగంపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంక్షలు అమలు చేస్తున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలకు ఊరట కలిగించేందుకు తిరుమల టూర్ ప్లాన్ చేశారు. వచ్చేనెల ఎనిమిదో తేదీన రాజ్యసభ పోలింగ్ జరిగే వరకు మైసూర్ తదితర ప్రాంతాల్లో ప్రణాళిక అమలు చేస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లతో బలోపేతం
బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీతోపాటు మహాకూటమిని బద్దలు కొట్టి, నితీశ్ కుమార్ను తమ వైపునకు తిప్పుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాట్లను ప్రోత్సహించిన కమలనాథులు బల పడ్డారు. కాగా, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫిరాయింపునకు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ప్రయత్నిస్తోందని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దాంతో, ఈ అంశంపై నివేదిక సమర్పించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం కోరింది. ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని ఆదేశించింది.