రసవత్తరంగా రాజ్యసభ పోలింగ్.. క్యాంపునకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎక్కడో తెలుసా..!!
అహ్మదాబాద్ : గుజరాత్ రాజ్యసభ ఎన్నిక రసవత్తరంగా సాగుతుంది. ఓ వైపు ఎన్నిక జరుగుతుండగా .. మరోవైపు ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం చేయడంతో .. ఆ పార్టీ హైకమాండ్ ముందే స్పందించింది. తమ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించి ముందుజాగ్రత్త చర్య తీసుకుంది. అయితే ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం రెబల్గా మారడం ఆందోళనకు గురిచేస్తోంది.
పోల్ టెన్షన్ ..
గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 71 సభ్యులతో విపక్ష బాధ్యతలు చేపడుతుంది. అయితే రెండు రాజ్యసభ స్థానాలకు ఇవాళ ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తోందనే భయం ఆ పార్టీని వెంటాడింది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించారు. శుక్రవారం ఎన్నిక ఉన్న నేపథ్యంలో బుధవారం రాత్రి .. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్కు తరలించింది. రాష్ట్రంలోని మౌంట్ అబు రిసార్ట్లో సురక్షితంగా ఉంచింది. మౌంట్ అబు .. అహ్మదాబాద్కు 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎమ్మెల్యేలను తరలించేందుకు సులువుగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు గుజరాత్ ఎల్పీ నేత పరేశ్ ధానాని పేర్కొన్నారు.
ఇద్దరు అటా.. ఇటా ...
మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ బృందంతో రాజస్థాన్ వెళ్లలేదు. అయితే గ్యసుద్దీన్ షేక్, ఇమ్రాన్ ఖాడేవాలా, భికాభాయ్ జోషి, విక్రమ్ మేడం నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకొని అహ్మదాబాద్లోనే ఉన్నారు. మరో ఇద్దరు అల్పేశ్ ఠాకూర్, ధావల్సింగ్ జాలా మాత్రం ఆ పార్టీలో తిరుగుబాటు ఎగరవేసిన సంగతి తెలిసిందే. అల్పేశ్ ఠాకూర్ .. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా .. జాలా మాత్రం తాను రిసార్ట్కు వెళ్లబోనని స్పష్టంచేశారు. బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతున్నందునే .. తాము ఎమ్మెల్యేలను తరలించామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 2017 రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ చేసిన అనైతిక చర్యలను ప్రజలంతా చూశారని గుర్తుచేశారు.
బరిలో వీరే ..?
గుజరాత్ రాజ్యసభ బరిలో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్, ఓబీసీ నేత జుగ్లాజి ఠాకూర్ బరిలో ఉన్నారు. కాంగ్రెష్ నుంచి చాంద్రిక చుదసమ, గౌరవ్ పాండ్యా పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కూడా రాజస్థాన్ తరలించిన కాంగ్రెస్ సభ్యులతోపాటే ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. పోలింగ్లో చేసే చిన్న తప్పిదం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నందున ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ రెండు రాజ్యసభ ఎన్నికలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.