గుజరాత్ తొలిదశ ఎన్నికలు నేడే: బరిలో హేమాహేమీలు
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ తొలి దశ ఎన్నికల ప్రచారం గురువారం ముగిసిన విషయం తెలిసిందే. శనివారం(డిసెంబర్9) ఉదయం 89 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది.ఈ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా 977 మంది బరిలో ఉన్నారు. వీరిలో 57 మంది మహిళలున్నారు. జామనగర్ రూరల్ నుంచి అత్యధికంగా 27 మంది పోటీచేస్తుండగా.. ఝగాడియా, గండేవి నుంచి అత్యల్పంగా ముగ్గురు మాత్రమే బరిలో ఉన్నారు.
రాజ్కోట్ నుంచి సీఎం రూపానీ
తొలిదశలో ముఖ్యంగా పశ్చిమ రాజ్కోట్ స్థానం నుంచి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనిల్ రాజ్యాగు రు ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. 1985 నుంచీ ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. మణినగర్కు వెళ్లకుమందు 2002లో ప్రధాని మోడీ ఇదే స్థానం నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు.
కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన ఇంద్రనీల్ తూర్పు రాజ్కోట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కుల సమీకరణాల్లో భాగంగా ఆయన్ని పశ్చిమ రాజ్కోట్కు మార్చారు.
అహ్మద్ పటేల్ సీఎం అభ్యర్థి అంటూ..
కాగా,తొలి దశ ఎన్నికల్లో అధికార బీజేపీ మొత్తం 89 స్థానాల్లో పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ రెండు స్థానాలు మినహా 87 స్థానాల్లో బరిలో ఉంది. ఇక బీఎస్పీ 64, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీపడుతోంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో 443 మంది స్వతంత్రంగా పోటీచేస్తున్నారు. మరోవైపు, గుజరాత్లో కాంగ్రెస్ గెలుపొందితే సీనియర్ నేత అహ్మద్ పటేల్ను సీఎంను చేస్తారని.. తూర్పు సూరత్లో పోస్టర్లు చివరి రోజు ప్రచారంలో దర్శనమివ్వడం గమనార్హం.
బరిలో కీలక నేతలు
ఈ తొలి దశ ఎన్నికల్లో కీలక నేతలైన జీతూ భాయి వాఘాని, శక్తి సింగ్ గోహిల్, అర్జున్ మోద్వాడియా తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓటర్లు వీరి భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. కాగా, మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు శనివారం తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 1.11కోట్లు. మహిళలు 1.01 కోట్లు. అత్యధికంగా కామ్రేజ్లో ఎక్కువ మంది ఓటర్లు ఉండగా.. ఉత్తర సూరత్లో తక్కువ మంది ఉన్నారు.
విస్తృత ప్రచారం
చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల తరపున ముఖ్యనేతలు పాల్గొన్నారు. సూరత్ లో మోడీ, మెహసనాలో అమిత్ షా, రాజ్ కోట్ లో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్ లో వినూత్నంగా లేజర్తో టెక్నాలజీతో ప్రచారం చేశారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా విస్తృత ప్రచారం నిర్విహించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల ఫలితాలు అటు మోడీ, ఇటు రాహుల్కు కీలకం కానున్నాయి.