రూపానీకి ఇలా హార్దిక్ సవాల్: నేడు పాటిదార్ల గడ్డపై క్యాంపెయిన్
సర్ధార్ పటేల్ ధ్రుడ సంకల్పం, షాహిద్ భగత్సింగ్, ఛత్రపతి శివాజీ శౌర్యాలను గుర్తుకు తెచ్చేలా హార్దిక్ పటేల్ ఎన్నికల ప్రచారం సాగనున్నది.
న్యూఢిల్లీ: పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ మీడియా స్రుష్టించిన నేతల్లో ఒకరని కొట్టి పారేసిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి గట్టి సవాల్ ఎదురైంది. రాజ్ కోట్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్న విజయ్ రూపానీకి వ్యతిరేకంగా హార్దిక్ పటేల్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. రమారమీ 75 వేల మంది పాటిదార్ల ఓట్లు గల రాజ్ కోట్ వెస్ట్ నియోజకవర్గంలో గెలుపొటములను నిర్దేశించేదీ పటేళ్లే కావడం గమనార్హం. 1980వ దశకం వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట. తొలిసారి 1984లో ఈ స్థానం నుంచి బీజేపీ గెలుపొందింది. నాటి నుంచి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగింది.
కానీ 2015లో పాటిదార్ల ఆందోళన ఉధ్రుతం కావడంతో ఆ సామాజిక వర్గం వారి మద్దతుతోనే అధికారం సంపాదించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాజ్ కోట్ వెస్ట్ స్థానానికి సుమారు 75,000 మంది పాటిదార్ ఓటర్లు ఉన్నారు. పాటిదార్లలో నెలకొన్న అనిశ్చితి తమ విజయానికి సోపానంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్యగురు భావిస్తున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రానిల్ రాజ్యగురుకు మద్దతుగా హార్దిక్ పటేల్ ప్రచారం చేయనున్నారు.
పది సభల్లో హార్దిక్ క్యాంపెయిన్ ఇలా
పటేళ్లకు నిలయమైన సౌరాష్ట్రలో బుధవారం నుంచి పది బహిరంగ సభల్లో హార్దిక్పటేల్ పాల్గొననున్నారు. రాజ్కోట్ జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహిస్తారు. తర్వాత మోర్బీ, సోమనాథ్, జునాగఢ్, హిమ్మత్నగర్ జిల్లాల్లో విస్త్రుతంగా పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని లాంఛనంగా ‘పాస్' ప్రకటించిన తర్వాత హార్దిక్ పటేల్ బహిరంగ సభల్లో పాల్గొననుండటం గమనార్హం. కానీ ‘పాస్' తన బ్యానర్ పై మాత్రమే బహిరంగ సభలు నిర్వహిస్తున్నదే తప్ప.. కాంగ్రెస్ పార్టీ వేదికను పంచుకునేందుకు సిద్ధంగా లేదు. తద్వారా బీజేపీతో ముఖాముఖీ పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మేలు చేయాలన్నదే పాస్ అసలు సిసలు వ్యూహం.
మహా క్రాంతి పేరిట రాజ్ కోట్లో పటేళ్ల భారీ ప్రదర్శన
ఓబీసీ రిజర్వేషన్ల కోసం 2015లో పోరాటం.. ప్రభుత్వ అణచివేత వ్యూహంతో పాటిదార్ల నుంచి భారీగా ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకున్నది బీజేపీ. ఈ క్రమంలో బుధవారం జరిగే ర్యాలీలో భారీగా పటేళ్లు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ‘మహా క్రాంతి (హరిత విప్లవం)' అనే పేరుతో నిర్వహించే ర్యాలీలో పాటిదార్లు పాల్గొననున్నారు.
పటేల్, భగత్సింగ్, ఛత్రపతి శివాజీ, హార్దిక్ ఫొటోలతో పోస్టర్లు
‘పాస్' మోర్బీ జిల్లా కన్వీనర్, అధికార ప్రతినిధి మనోజ్ పనరా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మేం మా డిమాండ్ కోసం ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతున్నాం. హార్దిక్ పటేల్ పాల్గొనే సభలో భారీగా సామాజిక కార్యకర్తలు, సామాజిక వర్గం నాయకులు భారీగా పాలుపంచుకోవాలి' అని కోరారు. రాజ్కోట్లో ‘పాస్' ఆధ్వర్యంలో జరిగే ర్యాలీకి లక్ష మందికి పైగా మద్దతుదారులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్దార్ వల్లభ్ భాయి పటేల్, షాహిద్ భగత్ సింగ్, ఛత్రపతి శివాజీలతోపాటు హార్దిక్ పటేల్ ఫొటో ముద్రించిన పోస్టర్లతో భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గుండె ధైర్యంతో ఎన్నికల ప్రచార బరిలో నిలవాలన్న నినాదంతో ముందుకు సాగుతోంది.
బీజేపీ డొల్లతనం బహిర్గతమే పాటిదార్ల లక్ష్యం
రాజ్ కోట్ వెస్ట్, రాజ్ కోట్ సౌత్, రాజ్ కోట్ రూరల్ స్థానాలకు కేంద్రమైన నానా మౌర్యా సర్కిల్లోని ముక్కోణ జంక్షన్లో బహిరంగ సభ జరుగనున్నది. ఈ మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో భారీగా పటేళ్ల జనాభా ఉంది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ముగ్గురు సీఎంలు వచ్చినా రాజ్ కోట్ జిల్లాను నిర్లక్ష్యం చేశారన్న నినాదం ప్రచారంలో కేంద్రంగా ఉంటుంది. అధికార బీజేపీ డొల్లతనాన్ని బహిర్గతం చేయడమే లక్ష్యంగా తమ ప్రచారం సాగుతుందని ‘పాస్' రాజ్ కోట్ జిల్లా కన్వీనర్, అధికార ప్రతినిధి హేమాంగ్ పటేల్ చెప్పారు. ‘పాస్' నేతలు ప్రస్తుతం ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలన్న వ్యూహంపై రూపొందిస్తున్నారు. వచ్చేనెల తొమ్మిదో తేదీన తొలి దశ, 14వ తేదీన రెండోదశ పోలింగ్ జరుగనున్నది.