అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ: గుజరాత్ లో రాహుల్ గాంధీ హామీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అధికారంలోకి వస్తే తాము రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అధికారంలోకి వస్తే తాము రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రాభవానికి గండికొట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అమ్రేలిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రుణమాఫీపై తమ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు.
పారిశ్రామిక వేత్తలకు 1.25 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన ప్రధాని మోడీని తాము రైతు రుణమాఫీ గురించి అడిగితే.. అది తమ విధానం కాదని తోసిపుచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
గత 22 ఏళ్లుగా రైతుల గురించి మాట్లాడుతున్న మోడీ వారికి చేసిందేమీ లేదని అన్నారు. రైతుల భూములు లాక్కుని సాగు నీటితో సహా వాటిని పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు.
రైతులకు కనీసం పంట బీమా కూడా అందలేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఒక రబ్బర్ స్టాంప్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ రాష్ట్ర పాలన అమిత్ షా చేతిలో ఉందని అన్నారు.
గుజరాత్ లో పటేళ్లు, దళితులు, రైతులు, అంగన్ వాడీ కార్యకర్తలు సహా అన్ని వర్గాల ప్రజలు తొలిసారిగా నిరసన బాటపట్టారని రాహుల్ అన్నారు. విమానాల్లో తిరిగే మోడీ స్నేహితులు ఐదుగురు లేక పదిమంది మాత్రమే గుజరాత్ లో సంతోషంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.