ఇది ఇంటర్వెల్ మాత్రమే... అసలు సినిమా ముందుంది: బీజేపీపై శివసేన
ముంబై: రాజస్థాన్ ఉపఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'అసలైన సినిమా ముందుంది...' అంటూ ఆ పార్టీపై శివసేన సెటైర్లు వేసింది.
గుజరాత్ ఎన్నికలు ఒక ట్రైలర్ అని, రాజస్థాన్ లో వచ్చిన ఫలితాలు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని... 2019లో అసలైన సినిమా ఉంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అసలు సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలపబోమని... ఒంటరిగానే పోటీ చేస్తామని రావత్ అన్నారు. ఒక్కసారి విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలితే... అది తిరిగి వెనక్కి రాదని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. పేపర్ల మీద చూడటానికి బాగానే ఉందని వ్యాఖ్యానించారు.
కానీ క్షేత్ర స్థాయిలో అవన్నీ అమలైతేనే బడ్జెట్ విజయవంతం అయినట్టని ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. నిన్న రాజస్థాన్ లో వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో రెండు లోక్సభ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.