బీజేపీ గెలిచినా, అందని రికార్డ్! రాహుల్ ఆశలు గల్లంతు!!: కాంగ్రెస్కు చేదు, బీజేపీకీ షాకే
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల సరళిని చూస్తే కాంగ్రెస్ పార్టీకి మరోసారి చావుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక రాష్ట్రాల వంటి ఎన్నికలకు, ఇంకా ముఖ్యంగా 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే బీజేపీకి మరింత ఉత్సాహమే.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో ఎగ్జిట్ ఫలితాలు అన్ని కూడా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. గుజరాత్లో కమలం పార్టీ వంద సీట్లకు పైగా గెలుస్తుందని ఎక్కువ సర్వేలు చెబుతున్నాయి. కొన్ని సర్వేలు మార్జిన్ సీట్లతో గెలుస్తుందని చెబుతున్నాయి. హిమాచల్లో అయితే కాంగ్రెస్ పరిస్థితి చావుతప్పి అన్న సామెతలా ఉంది.
గుజరాత్లో పోటీ ఇచ్చినా, హిమాచల్లో
గుజరాత్లో అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందని సర్వేల ద్వారా వెల్లడయ్యాయి. బీజేపీ అతి తక్కువ సీట్లతో కూడా గెలిచే పరిస్థితులు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. కానీ హిమాచల్లో మాత్రం కాంగ్రెస్కు భారీ ఓటమి ఖాయమని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
గెలిచినా, అమిత్ షా కోరిక నెరవేరేలా లేదు
ఎగ్జిట్ పోల్ సరళిని బట్టి బీజేపీ కోరిక మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి గుజరాత్లో 149 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఆ రికార్డ్ బద్దలు కొట్టేందుకు బీజేపీ ఉత్సాహం కనబరిచింది. తమకు 150 సీట్లు ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు చెప్పారు. గుజరాత్లో గెలిచినప్పటికీ కాంగ్రెస్ రికార్డ్ బద్దలు కొట్టాలన్న బీజేపీ ఆశలు మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. మరో విషయమేమంటే దశాబ్దాలుగా బీజేపీ ఏలుతుంది కాబట్టి ప్రజా వ్యతిరేకత వల్ల సీట్లు తగ్గుతాయని ఎవరైనా అనవచ్చు. కానీ 2019లో తిరుగులేని గెలుపు కావాలంటే అమిత్ షా భావించినట్లు 150 సీట్లు కాకపోయినప్పటికీ ఆ దరిదాపులో వచ్చినా బాగుండేదని అంటున్నారు. ఓ విధంగా తక్కువ సీట్లు రావడం కాంగ్రెస్ పుంజుకున్నట్లుగా భావించవచ్చు.
బీజేపీని దెబ్బకొట్టేందుకు
గుజరాత్లో బీజేపీ పాతుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారి ఎలాగైనా అధికార పార్టీని గద్దె దించాలని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. కానీ ఇప్పుడు కూడా ఎదురు దెబ్బ తగులుతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.
గుజరాత్ బీజేపీదే, కాంగ్రెస్ ఆశలు ఆవిరి: ఎగ్జిట్ పోల్, ఏ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
గెలిచేందుకు కాంగ్రెస్, రాహుల్ ప్రయత్నాలు
గుజరాత్ను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నాలు లేవు. రాహుల్ గాంధీ గుళ్లకు వెళ్లడం, ఓబీసీ, పటీదార్లు, దళిత నాయకులను కలుపుకొని వెళ్లడం వంటి ఎన్నో చేసింది. కానీ ఐనా బీజేపీని దెబ్బతీయలేకపోయింది. పటీదార్ ఉద్యమం, ఇతర ఉద్యమాలు బీజేపీని పెద్దగా దెబ్బతీయలేకపోయినట్లుగా కనిపిస్తోంది. కానీ ఓట్ల శాతాన్ని మాత్రం తగ్గించగలిగాయి. కమలం పార్టీని ఓడించలేకపోయాయి.
2019కు ముందు బీజేపీని దెబ్బతీయాలనుకుంటే
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని గుజరాత్లో దెబ్బతీసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని, తద్వారా బీజేపీని దిక్కుతోచని పరిస్థితిల్లోకి నెట్టాలని భావించాయి. ఇందుకోసం ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కూడా సహకరించాయి. బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నం చేశాయి. కానీ ఏ పార్టీ ప్రయత్నాలు కూడా ఫలించనట్లుగానే కనిపిస్తోంది. ఇక చివరి నిమిషంలో మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోడీని నీచ్ ఆద్మీ అనడం, కాంగ్రెస్ ఆయనను బహిష్కరించడం, మణిశంకర్ మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రధాని మోడీ నిలదీయడం వంటి అంశాలు కూడా బీజేపీకి కలిసి వచ్చాయని అంటున్నారు.
ఇక్కడ అది పని చేసిందా
పటీదార్ ఉద్యమ నాయకుడు, ఓబీసీ ఉద్యమ నాయకుడు, దళిత ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినప్పటికీ ఓట్లను చీల్చగలిగారే తప్ప సీట్లను మాత్రం గెలిపించలేకపోయారని అంటున్నారు. ముఖ్యంగా వారు ఆశించిన మేర వారి వెంట ఆయా వర్గాలు నిలబడనట్లుగా కనిపిస్తున్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం కూడా బీజేపీపై కొంత పడి సీట్లు తగ్గి ఉండవచ్చు.
హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్లో అయితే కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీకి మంచి మెజార్టీ వస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక్కడ జాతీయస్థాయి నేతల ప్రభావం కంటే స్థానిక ప్రభావమే ఎక్కువగా కనిపించింది.