కోవిడ్ కేర్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం: ఆరుమంది మృతి: విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
అహ్మదాబాద్: గుజరాత్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం ప్రత్యేకంగా చికిత్స అందిస్తోన్న ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుమంది పేషెంట్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. తొలుత ముగ్గురు సంఘటనలో మరణించారు. క్రమంగా ఈ సంఖ్య ఆరుకు పెరిగింది. కాలిన గాయాల బారిన పడ్డ వారిలో మరో ముగ్గురు ప్రాణాలు వదిలారు. అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఏమిటనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
గుజరాత్లోని రాజ్కోట్లో గల శివానంద్ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 11 మంది పేషెంట్లు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నికీలలు ఐసీయూ మొత్తం వ్యాపించాయి. అక్కడి బెడ్స్, ఇతర పరికరాలు దగ్ధం అయ్యాయి. దట్టమైన పొగ ఐసీయూను కమ్మేసింది.
ఈ ఘటనలో ముగ్గురు పేషెంట్లు పంఘటనా స్థలంలోనే మరణించారు. మిగిలిన ఎనిమిది మందిని మరో వార్డుకు తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు. అయినప్పటికీ- వారిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీనితో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. గాయపడ్డ వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కరోనా వైరస్ పేషెంట్లను మరో ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన సంభవించడానికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియ రాలేదని రాజ్కోట్ పోలీసులు వెల్లడించారు. కారణాల కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. పేషెంట్ల ప్రాణాలను కాపాడటాన్ని తొలి ప్రాధాన్యతగా భావిస్తున్నామని, అందుకే వారిని వేరే ఆసుపత్రికి తరలిస్తున్నామని అన్నారు.
అనంతరం ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ సమగ్ర విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదిక అందజేయాలని రాజ్కోట్ కలెక్టర్, జిల్లా వైద్యాధికారులకు సూచించారు.