పట్టణాల పేర్లే కాదు... ఫలాల పేర్లు కూడా మార్పు... ఇకపై 'కమలం'గా డ్రాగన్ ఫ్రూట్...?
డ్రాగన్ ఫ్రూట్... గులాబీ రంగులో, కొబ్బరికాయ ఆకారంలో,మొనదేలినట్లుగా ఉండే తొనలతో చూడగానే చాలా ఎట్రాక్టివ్గా కనిపిస్తుంది. మన దేశంలో ఈ ఫ్రూట్ని ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇది 'డ్రాగన్ ఫ్రూట్' పేరుతోనే పాపులర్. కానీ గుజరాత్ ప్రభుత్వం ఉన్నట్టుండి దీని పేరు మార్చేయాలని నిర్ణయించింది. డ్రాగన్ ఫూట్కు బదులు 'కమలం' అనే పేరును దీనికి సూచిస్తూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. మంగళవారం(జనవరి 19) రాష్ట్రంలో హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్ ప్రారంభించిన సందర్భంగా రూపానీ మీడియాతో మాట్లాడారు.
డ్రాగన్ అనే శబ్దం సరిగా లేదని... అందుకే దాన్ని కమలంగా మార్చాలని నిర్ణయించామన్నారు రూపానీ. ఇప్పటినుంచి ఆ ఫలాన్ని కమలం అనే పిలవాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డ్రాగన్ ఫ్రూట్ కమలం ఆకారంలోనే ఉంటుందని... కమలం సంస్కృత పదమని... అందుకే దానికి ఆ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇందులో రాజకీయాంశాలేమీ లేవని తెలిపారు. దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు.
కాగా,బీజేపీ అధికారిక ఎన్నికల చిహ్నం కమలం గుర్తు అన్న సంగతి తెలిసిందే. గాంధీనగర్లోని బీజేపీ కార్యాలయం పేరు కూడా శ్రీకమలం కావడం గమనార్హం. ఇప్పుడిదే పేరును డ్రాగన్ ఫ్రూట్కు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయా అన్నది చూడాలి.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా ఆయా నగరాలు,పట్టణాల పేర్ల మార్పులపై ఆ పార్టీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా మార్చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ను భాగ్యనగరంగా,కరీంనగర్ను కరిపురంగా... ఇలా పలు నగరాల పేర్లు మార్చేస్తామని ఇక్కడి నేతలు చెప్తున్నారు. ఇలా పట్టణాలు,నగరాలకే పరిమితమైన పేర్ల మార్పు ఇప్పుడు ఫలాల పైకి కూడా మళ్లడం కచ్చితంగా చర్చనీయాంశమే.