పబ్జి గేమ్పై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రైమరీ స్కూల్స్లో నిషేధం
అహ్మదాబాద్: ఇటీవలి కాలంలో విద్యార్థులు పబ్జి ఆటలో మునిగిపోతోన్న విషయం తెలిసిందే. ప్రైమరీ స్కూల్ మొదలు కాలేజీ విద్యార్థుల వరకు ఆ ఆటకు బానిస అవుతున్నారు. పైగా సెల్ఫోన్లో గంటలుగా ఆడుతున్న ఈ ఆట కారణంగా కళ్లు దెబ్బతింటున్నాయి. చదువులపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పబ్జి గేమ్ను బ్యాన్ చేయాలని జిల్లా విద్యాధికారులకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ మంగళవారం దీనిని విడుదల చేసింది. గుజరాత్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రైమరీ స్కూల్స్లలో విద్యార్థులు పబ్జి గేమ్ ఆడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ గేమ్కు విద్యార్థులు బానిస అవుతున్నారని, కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పబ్జి గేమ్ కారణంగా పలువురు విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఆ గేమ్కు బానిస అవుతున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్లో జరిగిన టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్లలో చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫలితాలు చూసిన జమ్ము కాశ్మీర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్కు పబ్జి మొబైల్ గేమ్ను బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేసింది. పబ్జి మొబైల్ కు వ్యసన పరులుగా మారినందునే పరీక్షల ఫలితాలు దారుణంగా వచ్చాయని, కాబట్టి గేమ్ను నిషేధించాలని తల్లిదండ్రులు కూడా కోరారు.
ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం తాజాగా గేమ్ను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. గుజరాత్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు పబ్జి మొబైల్ గేమ్ ఆడకుండా చూడాలని, ఇందుకు జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.