హైకోర్టుకు హార్దిక్ పటేల్: అదృశ్యంపై జడ్జికి వివరణ
అహ్మాదాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ పోలీసులు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ను గురువారం ఉదయం అహ్మాదాబాద్లోని హైకోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా తన అదృశ్యానికి సంబంధించిన పరిణామాలను హార్దిక్ పటేల్ న్యాయమూర్తికి వివరించారు.
తనని కిడ్నాప్ చేసిన తీరుని కూడా ఆయన న్యాయమూర్తికి వివరించారు. "చుట్టూ ఆయుధాలు ధరించిన పోలీసులు. నేనేమో కారులో కూర్చున్నాను. నన్ను బయటకు దిగనివ్వలేదు, కారును ముందుకు కదలనివ్వలేదు. నిన్న సాయంత్రం వరకూ కారులోనే కూర్చుండి పోయాను. ఇకపై నిరసన ర్యాలీలు చేపట్టవద్దని వారు నన్ను హెచ్చరించారు" అని హార్దిక్ పటేల్ వివరించారు.
మంగళవారం సాయంత్రం తర్వాత పోలీసులు తనని విడిచిపెట్టారని, ఆ తర్వాత అహ్మదాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలోని విరంగామ్కు చేరుకున్నానని తెలిపారు. కారులో తన చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులని భావిస్తున్నానని, వారు పోలీసులు అవునో... కాదో తనకు పూర్తిగా తెలియదని చెప్పారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చే వరకు తన ఆందోళన ఆగదని ప్రకటించారు. వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడికి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. అమెరికాలోని పటేల్ సామాజిక వర్గం ప్రతినిధులు మోడీకి నిరసన తెలిపారని పేర్కొన్నాడు.
గతంలో బీజేపీకి ఇచ్చిన విరాళాలను కూడా వెక్కిచ్చేయాలని తమ పటేళ్లు ఆ పార్టీని కోరారన్నారు. మోడీ ప్రధాని అయ్యాక తొలిసారి అమెరికా పర్యటన సందర్బంగా జరిగిన వివిధ కార్యక్రమాల కోసం పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారు రూ.35 లక్షల డాలర్లను బీజేపీకి అందజేశారన్నారు. ఆ సొమ్మంతా తిరిగి ఇచ్చేయమని తమ పటేళ్లు బీజేపీకి ఇప్పటికే లేఖలు రాశారని అన్నారు.
పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న హార్దిక్ పటేల్ మంగళవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. దీంతో హార్దిక పటేల్ను గుజరాత్ పోలీసులే చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ హార్దిక్ పటేల్ సన్నిహితుడు దినేష్ పటేల్, కొందరు లాయర్లతో కలిసి మంగళవారం రాత్రి 1.20 హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన గుజరాత్ హైకోర్టు జడ్జిలు జస్టిస్ షా, జస్టిస్ కేజే థాకూర్లు వెంటనే హర్దిక్ పటేల్ను కోర్టు ముందు హాజరు పరచాలని రాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ హార్దిక్ పటేల్ను బుధవారం కోర్టు ముందు ఉంచాలని జడ్జి పోలీసు శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే.