పంజాబ్ తరహా పంచ్: జోరుగా స్థానిక సంస్థల పోలింగ్: ఓటు వేసిన కేంద్రమంత్రి అమిత్ షా
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది మొన్నటికి మొన్నే స్పష్టమైంది. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోయింది. కనీసం ప్రతిఘటన ఇవ్వలేక చేతులెత్తేసింది. బీజేపీ ఒక్కటే కాదు.. ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ పరిస్థితీ అంతే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాను చాటింది. మెజారిటీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసింది.
ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సాగుతోన్న ఉద్యమంలో పంజాబ్ రైతులు కీలక పాత్ర పోషిస్తోండటం దీనికి కారణంగా విశ్లేషించారు. తాజాగా- గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఆదివారం ఆరంభమైంది. ఇక అందరి దృష్టీ వాటి ఫలితాల మీద నిలిచాయి. బీజేపీకి కంచుకోటలాంటి రాష్ట్రం.. గుజరాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంలో, బీజేపీలో నంబర్ టూగా గుర్తింపు పొందిన అమిత్ షా స్వరాష్ట్రం ఇది.
ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. పంజాబ్ తరహా ఫలితాలు వెలువడుతాయా? లేదా? అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. కాగా- స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అమిత్ షా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని నరన్పురా సబ్ జోనల్ కార్యాలయంలో కొద్దిసేపటి కిందటే ఆయన ఓటు వేశారు. తన కుమారుడు, భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా, భార్యతో కలిసి ఆయన తన ఓటు హక్కును వినియోగించకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేశారు. సాధారణ ఓటర్లను కొద్దిసేపు నిలిపివేశారు. అమిత్ షా కుటుంబం ఓటు వేసి, వెళ్లిన తరువాతే మిగిలిన వారికి అనుమతి ఇచ్చారు. అహ్మదాబాద్తో పాటు సూరత్, వడోదర, రాజ్కోట్, భావ్నగర్, జామ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.
బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రంగంలో నిలిచాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే వార్డుల్లో ఏఐఎంఐఎం సైతం అభ్యర్థులను పోటీకి దింపింది.