గుజరాత్ లో వరదలు, బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విందు, చిందులు: మీకు సిగ్గుందా !
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలవిలలాడిపోతున్నారు.
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలవిలలాడిపోతున్నారు. గుజరాత్ కు చెందిన 44 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరు నగర శివార్లలోని రిసార్ట్ లో దాచి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.
బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిలోని బిడిది సమీపంలోని ఈగల్టన్ ది గాల్ఫ్ రిసార్ట్స్ లో గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జల్సా చేస్తున్నారు. ప్రతి రోజు మూడుపూటల రకరకాల వంటకాలు తింటూ ఆటా పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఆరు మంది ఎమ్మెల్యేలు జంప్
గుజరాత్ కు చెందిన ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే దిక్కులేకపోవడంతో తన పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకు వచ్చి నగర శివార్లలోని రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ ఎమ్మెల్యేలు జంప్ అవుతారో అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
అక్కడ వరదలు, ఇక్కడ జల్సాలు
గుజరాత్ లోని దిసా ప్రాంతంలో వరదల కారణంగా స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే (కాంగ్రెస్) గోవాబాయ్ బెంగళూరు నగర శివార్లలోని విలాసవంతమైన రిసార్ట్ లో జల్సా చేస్తున్నారని హరితా వారాణాసి సోషల్ మీడియాలో మండిపడ్డారు.
మీకు సిగ్గులేదా ?
గుజరాత్ లో ఎన్ డీఆర్ఎఫ్, బీజేపీ ఎమ్మెల్యేలు వరదబాధితులు ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వారికి ఆహారం అందిస్తున్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరు నగర శివార్లలోని రిసార్ట్ లో సిగ్గు లేకుండా జల్సాలు చేస్తున్నారని సంజిబ్ ఘోష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మండిపడ్డారు.
ప్రజాప్రతినిధులను కూనీ చేసిన కాంగ్రెస్ !
ప్రజాప్రభుత్వాన్ని అంతం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి ప్రజాప్రతినిధులను కూనీ చేస్తున్నారని సీమా చౌధరి అనే యువతి సోషల్ మీడియాలో విమర్శించారు.
శశికళ గుర్తుకు వస్తున్నారు !
గుజరాత్ కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే తమిళనాడుకు చెందిన శశికళ నటరాజన్ (చిన్నమ్మ) గుర్తుకు వస్తున్నారు. ఆమె ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి రిసార్ట్ లో పెట్టారని, అందుకే శశికళ వర్గం తమిళనాడులో అధికారంలో ఉన్నా ప్రజల విశ్వాసాన్ని పోగుట్టుకున్నారని, అలాగే ఇప్పుడు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అదే పరిస్థితి ఎదురౌతుందని గీతికా స్వామి సోషల్ మీడియాలో విమర్శించారు.
లంచం కోసం మీ పార్టీ ఎమ్మెల్యేలు ?
కాంగ్రెస్ పార్టీ రిసార్ట్ రాజకీయాలు గమనిస్తుంటే సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు లంచంకు ఆశపడి బీజేపీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ బయటి ప్రపంచానికి చాటి చెప్పినట్లు అయ్యింది, మీ పార్టీ ఎమ్మెల్యేలు లంచానికి అమ్ముడుపోయే అవకాశం ఉందా ? అంటూ కల్పనా ఆ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు.
ప్రజలను గాలికి వదిలేసి ఎమ్మెల్యేల కోసం ?
గుజరాత్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానిక ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారని, అయితే ప్రజల సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ప్రకాష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో మండిపడ్డారు. మొత్తం మీద గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సోషల్ మీడియాలో ఆ పార్టీ నాయకత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.