మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్... పొరుగు రాష్ట్రాల అలర్ట్... కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఎంట్రీ...
దేశమంతా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినవేళ మహారాష్ట్ర,కేరళ,రాజస్తాన్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు జిల్లాలు,నగరాల్లో అక్కడి ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ను విధించింది. అటు రాజస్తాన్లోని జోద్పూర్లో అక్కడి ప్రభుత్వం మార్చి 21 వరకూ సెక్షన్ 144 విధించింది.
మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రయాణికులకు ఆంక్షలు విధించింది. కర్ణాటక-మహారాష్ట్రలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర నుంచి అలంద్,అఫ్జల్పురా మీదుగా కర్ణాటకకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మధ్యప్రదేశ్,గుజరాత్ రాష్ట్రాలు కూడా మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేశాయి. మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రాల్లోకి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్ చేయాలని నిర్ణయించాయి.
సోమవారం(ఫిబ్రవరి 22) నాటికి భారత్లో కరోనా కేసుల సంఖ్య 1.10కోట్లకు చేరింది. ఈ ఒక్కరోజే 14,199 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదో రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1.5లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం 1,10,05,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... 1,56,385 మంది మృతి చెందారు.
మహారాష్ట్ర,కేరళతో పాటు పంజాబ్,ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 15 రోజుల్లో ముంబైలో కరోనా కేసులు 36.38శాతం పెరిగినట్లు తెలిపింది. ప్రజల నిర్లక్ష్య వైఖరి వల్లే మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. గడిచిన 24గంటల్లో కరోనా నిబంధనలు పాటించని 500 మందికి జరిమానా విధించినట్లు ముంబై కార్పోరేషన్ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 16,02,536 మందికి జరిమానా విధించగా... 32,41,14,800 వారి నుంచి వసూలు చేసినట్లు చెప్పారు.
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముంబైలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో టెస్టుల సంఖ్య 15వేలు మాత్రమే ఉండగా... ఇప్పుడు దాన్ని 22వేలకు పెంచినట్లు చెప్పారు. మొత్తం కేసుల్లో అసింప్టమాటిక్ కేసులే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ మ్యుటేషన్ గురించి తెలుసుకోవడానికి ఇప్పటికే 90 మంది శాంపిల్స్ను పుణే వైరాలజీ ల్యాబ్కు పంపించినట్లు చెప్పారు. మరో 10-15 రోజుల్లో ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో ఇప్పటివరకూ ఏడుగురు మంత్రులు కరోనా బారినపడ్డారు. తాజాగా ఫుడ్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ భుజ్బల్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన ఆయన.. మహారాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమరావతి,అకోలా,బుల్దానా,వషీమ్,యావత్మల్ జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.