పెట్రోల్ రేటు రూ.100 దాటినా డోన్ట్ కేర్: మోడీ-షా జోడీకే గుజరాతీయుల జై: కాంగ్రెస్ డీలా
అహ్మదాబాద్: ఊహించిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్.. మరోసారి భారతీయ జనతాపార్టీకే పట్టం కట్టింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్కు మంచి పట్టు ఉన్న పంజాబ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయో.. అచ్చంగా అలాంటివే గుజరాత్లోనూ వస్తోన్నాయి. పంజాబ్లో బీజేపీ మూడు వ్యవసాయ బిల్లుల వ్యతిరేక పవనాల్లో కొట్టుకుని పోగా.. గుజరాత్లో కాంగ్రెస్ అలాంటి ఫలితాన్నే చవి చూసింది. గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రికార్డులను కొల్లగొట్టే రేంజ్లో విజయాలను అందుకుంటోంది.
దేశంలో రోజురోజుకూ పెరుగిపోతోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఇదివరకెప్పుడూ లేనంత అధ్వాన్నపు బడ్జెట్ను ప్రవేశపెట్టిందనే విమర్శలు.. బీజేపీ దగ్గరికి కూడా చేరలేకపోయాయనే విషయాన్ని గుజరాత్ మున్సిపల్ ఎన్నికలు స్పష్టం చేశాయి. నిత్యావసర సరుకులు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం.. బీజేపీ విజయాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. కమలనాథుల ఓటుబ్యాంకును దెబ్బతీయలేకపోయింది.
గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ సహా సూరత్, వడోదర, రాజ్కోట్, జామ్నగర్, భావ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. రాజ్కోట్, జామ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతాను కూడా తెరవలేకపోయిందంటే.. కమలనాథుల ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అహ్మదాబాద్లో బీజేపీ-80, కాంగ్రెస్-20, సూరత్లో బీజేపీ-56, కాంగ్రెస్-8, వడోదరలో బీజేపీ-41, కాంగ్రెస్-7, రాజ్కోట్లో బీజేపీ-48, కాంగ్రెస్-0, జామ్నగర్లో బీజేపీ-28, కాంగ్రెస్-0, భావ్నగర్లో బీజేపీ-32, కాంగ్రెస్-8 స్థానాలను గెలుచుకున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
తొలిసారిగా గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. సూరత్లో మాత్రం ఆప్ గట్టి పోటీ ఇచ్చింది. 15 డివిజన్లలో ఆధిక్యతలో కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, మూడు వ్యవసాయ బిల్లులపై నెలకొన్న వ్యతిరేకత వల్ల ఈ సారి బీజేపీ కొంతమేరకైనా డీలా పడుతుందని ప్రత్యర్థి పార్టీలు అంచనా వేశాయి. తాము గట్టి పోటీ ఇచ్చామని భావించాయి. అవేవీ బీజేపీ ధాటికి నిలువలేకపోయాయి. తన ప్రభంజనాన్ని బీజేపీ కొనసాగిస్తోందక్కడ.