షాక్: గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం టెన్షన్, కారులో ఈవీఎంలు మరిచిపోయారు !
అహ్మదాబాద్: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో అందరూ షాక్ కు గురయ్యే ఓ విషయం వెలుగు చూసింది. ఎన్నికల పోలింగ్ విధులకు హాజరైన అధికారులు ఓ ఈవీఎం యూనిట్ను ఓ ప్రైవేటు కారులో వదిలేసి వారి నిర్లక్షాన్ని మరో సారి ప్రదర్శించారు.
స్ట్రాంగ్ రూంకు ఈవీఎంలు
గుజరాత్ లో శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో భాగంగా శనివారం నర్మద జిల్లాలోని దండిపద నియోజకవర్గంలోని కంజల్ గ్రామంలో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను రాజ్పిప్లలోని స్ట్రాంగ్ రూమ్కి తరలించాల్సి ఉంది.
Recommended Video
కారులో వదిలేశారు
ఓ ప్రయివేటు కారులో ఈవీఎంలను రాజ్ పిప్లలోని స్ట్రాంగ్ రూంకు అధికారులు తరలించారు. ఆ సందర్బంలో ఓ ఈవీఎం యూనిట్ ను కారులో మరిచిపోయారు. ఆదివారం కారు డ్రైవర్ ఈవీఎంలు గుర్తించి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈవీఎంలు పోలింగ్ లో ?
కారులో మరిచిపోయిన ఆ ఈవీఎంలను పోలింగ్ కోసం వినియోగించలేదని, అది ఖాళీదేనని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్ఎస్ నినమా చెప్పారు. సాంకేతిక లోపం తలెత్తితే వెంటనే వినియోగించేందుకు వీలుగా మొత్తం ఆరు ఈవీఎంలను అదనంగా పంపించామని జిల్లా కలెక్టర్ ఆర్ఎస్ నినమా చెప్పారు.
మూడు ఈవీఎంల యూనిట్ !
ఆరు యూనిట్లలోని మూడు ఈవీఎంలున్న ఓ యూనిట్ను ఎన్నికల పోలింగ్ అధికారులు కారులో మర్చిపోయారని, దీనిపై అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశామని, ఎన్నికల కమిషన్ అధికారులకు వివరణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ ఆర్ఎస్ నినమా వివరించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఫైర్
అధికారుల నిర్లక్షంగా వ్యవహరించారని, పోలింగ్ నమోదు అయిన ఈవీఎంలు మరిచిపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఆరోపణలు చేశారు. కారులో ఈవీఎంలు మరిచిపోయిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని నర్మద జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.