మోడీకి పరువు, రాహుల్కు లిట్మస్ టెస్ట్: రేపే గుజరాత్ ఎన్నికల ఫలితాలు
అహ్మదాబాద్: ప్రస్తుతం అందరి చూపు గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు కూడా సోమవారమే. కానీ గుజరాత్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు ఓ వైపు ప్రధాని మోడీ పలుకుబడి ఇంకా ఉందా తేల్చనున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ భవిష్యత్తుకు లిట్మస్ పరీక్ష.
చదవండి: నాన్సెన్స్: గుజరాత్లో బీజేపీ గెలుపుపై జిగ్నేష్, అందుకే బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
తాజా గుజరాత్ ఎన్నికకు, 2019 సార్వత్రిక ఎన్నికలకు మధ్య కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. మోడీ సొంత రాష్ట్రం కావడం, దశాబ్దాలుగా బీజేపీ పాలిస్తుండటం, రాహుల్ గాంధీ అధ్యక్షుడు అయిన సమయంలో ఫలితాలు వస్తుండటం, ముఖ్యంగా రాహుల్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వంటి కారణాల వల్ల అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
చదవండి: గుజరాత్ ఎన్నికలు: కుక్కపిల్ల కూడా మోడీనే వస్తారంటోంది, మీరూ చూడండి (వీడియో)
అన్నీ తామై నడిపించారు
మొదటి దశలో 19 జిల్లాల్లో 89 నియోజకవర్గాల్లో, రెండో దశలో 14 జిల్లాల్లో 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 33 జిల్లాలలోని 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభం అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో పోటాపోటీగా ప్రచారం చేశాయి. అధికార పార్టీ తరఫున మోడీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ అన్నీ తామై నడిపించారు.
ఈ అంశాలే అస్త్రాలుగా
రామాలయం, అభివృద్ధి, గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వంటి వాటితో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయగా, అభివృద్ధి లేదంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. కుల సంఘాల నేతలతో కలిసి కాంగ్రెస్.. బీజేపీని ఎదుర్కొంది.
బీజేపీని దెబ్బతీసేందుకు చేతులు కలిపింది
కొంతకాలంగా హార్దిక్ పటేల్ నేతృత్వంలో పటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఓబీసీ రిజర్వేషన్ల కోసం అల్పేశ్ ఠాకూర్, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ జిగ్నేష్ మేవానీ ఆందోళన చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో పటిదార్ వర్గం 12 శాతం ఉంది. దీంతో ఎలాగైనా బీజేపీని అధికార పీఠం నుంచి తప్పించాలని కాంగ్రెస్ వీరితో చేతులు కలిపింది.
ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే గెలుపు అన్నాయి కానీ
రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సగటున 68 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. 2012 ఎన్నికల్లో 71.32శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈసారి దాదాపు మూడు శాతం తగ్గింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందని తేల్చాయి. సోమవారం ఫలితం తేలనుంది.