గుజరాత్ ఎన్నికలు: గెలుపు ఓటములపై వేరుశనగ ప్రభావం, పాటిదార్ల ఆందోళనకు కారణమిదే!
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి తొలి విడత డిసెంబర్ 9వ, తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వేరు శనగ( పల్లీలు) గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కే అవకాశం ఉందా, బిజెపి అధికారాన్ని మరోసారి కైవసం చేసుకొంటుందా అనే విషయమై ఓటర్లు తమ తీర్పును ఇవ్వనున్నారు.
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9వ, తేదిన తొలివిడత, మలి విడత పోలింగ్ 14వ తేదీన జరగున్నాయి.ఈ ఎన్నికల్లో పటేల్ సామాజిక వర్గం పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి.
పటేల్ సామాజిక వర్గానికి చెందిన హర్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తుండడంతో గుజరాత్ రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోననేది కొన్ని గంటల్లోనే తేలనుంది
గుజరాత్ ఎన్నికలపై వేరుశనగ ప్రభావం
వంద కిలోల పల్లీలకు నాలుగువేల రూపాయలకు తక్కువగా కనీస మద్దతు ధర ఉండేది కాదు. వరుసగా గత మూడేళ్లుగా పల్లీల కనీస మద్దతుధర 3000 నుంచి 3200 రూపాయలను మించలేదు. చమురు మిల్లులకు పల్లీలను అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు వాటికి 3,200 రూపాయల వరకు ధర పలికేది. పామాయిల్ లాంటి చమురు ఉత్పత్తులను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల పల్లి నూనెల ధర దారుణంగా పడిపోయింది. పామాయిల్ దిగుమతి కారణంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల మార్కెట్లో పల్లి నూనె వాట 15 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది.
పామాయిల్ దిగుమతులతో
2005 సంవత్సరం వరకు పామాయిల్పై దిగుమతి సుంకం 80 శాతం ఉండగా, 2008 నాటికి పూర్తిగా ఎత్తివేశారు. రైతులు, దేశీయ చమురు మిల్లుల యజమానులు గొడవ చేయడంతో మళ్లీ పామాయిల్పై 15 శాతం వరకు దిగుమతి సుంకం విధించారు. ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 1992-93 సంవత్సరంలో మనకు కావాల్సిన వంటనూనెలో 3 శాతాన్ని మాత్రమే దిగుమతి చేసుకోగా, ఇప్పుడు 75 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నామని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోపియేషన్ అధ్యక్షుడు భారత్ మెహతా తెలిపారు.
గుజరాత్లో సీఎంలను నిర్ణయించే ఆయిల్ వ్యాపారులు
గుజరాత్లోని ఒక్క సౌరాష్ట్రలోనే 1400 ఆయిల్ మిల్లులున్నాయి. ఆ మిల్లుల యజమానులను ఆయిల్ కింగ్స్ అని పిలిచేవారు.1980, 1990వ దశకాల్లో ఆయిల్ వ్యాపారులే గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థులను నిర్ణయించేవారని సౌరాష్ట్ర చమురు మిల్లుల అసోసియేషన్ సంఘం మాజీ అధ్యక్షుడు ఉకాభాయ్ పటేల్ తెలిపారు.
దాదాపు 500 మిల్లులు మూతపడ్డాయి. వారంతా రోడ్డున పడ్డారు.
రిజర్వేషన్ల కోసం పాటిదార్ల ఆందోళన
పండించిన పల్లీలకు గిట్టుబాటు ధర లేక రైతులు కూడా రోడ్డున పడ్డారు.వారిలో 96 శాతం మంది పాటిదార్లే అవడం వల్ల వారు 2015లో రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కారు. గుజరాత్లో ఒకప్పటికి ఇప్పటికీ 60 లక్షల టన్నుల పల్లీల ఉత్పత్తి పడిపోయింది. ప్రస్తుతం పాటిదార్లు ఎటు మొగ్గు చూపుతారోననేది ఉత్కంఠగా మారింది.
సౌరాష్ట్రకు పాటిదార్ల వలస
ఉత్తర గుజరాత్కు చెందిన చెందిన పాటిదార్లు 1950 ప్రాంతంలో సౌరాష్ట్రకు వలసపోయారు. 1956లో భూసంస్కరణల చట్టం రావడంతో ఒక్కసారిగా వారి జీవితాలే మారిపోయాయి. వారంతా భూ యజమానులుగా మారిపోయారు. అప్పటి వరకు చిరు ధాన్యాలు పండించిన వారు వేరుశెనగ పంటకు మళ్లారు. ఆ పంటలకు వారికి మంచి గిట్టుబాటు ధర రావడంతోపాటు మిగులు కూడా ఎక్కువే ఉండడంతో పాల డెయిరీ, నూనె, పిండి మిల్లులు లాంటి వ్యవసాయ పరిశ్రమలపై దృష్టిని కేంద్రీకరించారు.