రాజ్యసభ ఎన్నికలు, డీకేకి ఫోన్ చేసిన అహ్మద్ పటేల్, క్రెడిట్ మొత్తం, గిఫ్ట్ గా హోం శాఖ!
బెంగళూరు: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు. వారం రోజుల పాటు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడినందుకే నేను విజయం సాధించానని అహ్మద్ పటేల్ థ్యాక్స్ చెప్పారు.
బుధవారం అహ్మద్ పటేల్ గెలుపు విషయంలో కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ స్పందించారు. బెంగళూరులోని సదాశివనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానని అన్నారు.
గుజరాత్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికలను దేశం మొత్తం చూసిందని చెప్పారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రముఖ పాత్ర పోషించిందని, ఆపరేషన్ కమల (బీజేపీ) భయంతోనే గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులను బెంగళూరు తీసుకు వచ్చామని డీకే. శివకుమార్ వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అన్నారు. అహ్మద్ పటేల్ గెలుపు క్రెడిట్ తనకు వద్దని, ఆ క్రెడిట్ గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులకే ఇవ్వాలని అన్నారు. తన పదవుల విషయంలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. డీకే శివకుమార్ కు కర్ణాటక హోం శాఖ మంత్రి పదవి ఇస్తారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.