గుజరాత్లో ఏ ప్రాంతంలో ఎలా?: 10 కీలక నియోజకవర్గాలు ఇలా
అహ్మదాబాద్: రెండు ఫేజ్ల్లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 182 సీట్లకు గాను బీజేపీ వంద సీట్ల వరకు గెలుచుకుంటోంది. కాంగ్రెస్ ఎనభై సీట్ల వరకు గెలుచుకుంటోంది. ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీని ఇచ్చింది.
Recommended Video
ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణ గుజరాత్లో బీజేపీ 24 సీట్లు, ఉత్తర గుజరాత్లో 18 సీట్లు, మధ్య గుజరాత్లో 40 సీట్లలో పట్టు సాధిస్తోంది. సౌరాష్ట్ర - కచ్ ప్రాంతాల్లో 29 సీట్లలో సత్తా చాటుతోంది. కాంగ్రెస్ దక్షిణ గుజరాత్లో 30 సీట్లు, ఉత్తర గుజరాత్లో 13 సీట్లు, మధ్య గుజరాత్లో 19, సౌరాష్ట్ర కచ్లో 11 సీట్లలో సత్తా చాటుతోంది.
ఇదిలా ఉండగా పది నియోజకవర్గాలపై అందరి దృష్టి ఎక్కువగా ఉంది. అవి 1. వాగ్దామ్, 2. మణి నగర్, 3. రాజ్కోట్ (వెస్ట్), 4. మాండ్వి, 5. సూరత్ (సౌత్), 6.కమ్రేజ్, 7. వరచ్చా రోడ్, 8. పోరుబందర్, 9. రాధాన్పూర్, 10.ధరియాపూర్లపై అందరి దృష్టి పడింది.
వాగ్దామ్ నియోజకవర్గం
వాగ్దామ్ నియోజకవర్గాన్ని ధన్దర్ అని కూడా అంటారు. దీనిని ఒకప్పుడు రాజ్పుత్లు పాలించారు. వాగ్దమ్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్కు రిజర్వ్ అయింది. ఈ కులానికి సంబంధించిన వారు 13.56 శాతం ఓటర్లు ఉంటారు. 2012లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత మనీలా వాఘేలా గెలిచారు. ఇప్పుడు దళిత్ నేత జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. బీజేపీ నేత చక్రవర్తి విజయ్కుమార్ హర్కాభాయి పైన జిగ్నేష్ గెలిచారు.
మణి నగర్ నియోజకవర్గం
మణి నగర్ను అహ్మదాబాద్ దాదార్ అని పిలుస్తారు. 2002 నుంచి ఇది నరేంద్ర మోడీ నియోజకవర్గం. గుజరాత్ ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్ మణి నగర్ దగ్గరలోనే ఉంది. ఇక్కడ బ్రాహ్మణులు 9 శాతం, పటేళ్లు 21 శాతం, బనియాలు 8 శాతం ఉన్నారు. సింధి, మరాఠీ, తమిళ్, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ముస్లీంలు, క్రైస్తవులు కూడా పెద్ద మొత్తంలో ఉంటారు. 1975 నుంచి ఈ నియోజకవర్గం ఉంది. 1980, 1985లలో కాంగ్రెస్ గెలిచింది. 1990 నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తోంది. ఇక్కడి నుంచి మోడీ మూడుసార్లు గెలిచారు. 2014లో మోడీ రాజీనామా చేశాక సురేష్ పటేల్ దాదాపు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం
రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం... సౌరాష్ట్రలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పటేల్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. 42 వేలకు పైగా ఖాద్వా పటేల్స్ ఉంటారు. 33 వేల మంది ల్యూవా పటేల్స్, 25 వేల మంది బ్రాహ్మణులు, 35వేల మంది క్షత్రియులు, 25 వేల మంది బనియాలు, పదివేల మంది జైనులు ఉంటారు. 1985 నుంచి ఇక్కడ బిజెపి గెలుస్తోంది. వాజుభాయ్ వాల్ 1985 నుంచి 2002 వరకు గెలిచారు. 2002లో మోడీ కోసం వాజూబాయ్ సీటును వదులుకున్నారు. ఆ తర్వాత మోడీ మళ్లీ మణి నగర్ వెళ్లిపోయారు. ప్రస్తుతం సీఎం విజయ్ రూపానీ ఇక్కడి నుంచి గెలుపొందారు.
మాండ్వి నియోజకవర్గం
మాండ్వి నియోజకవర్గం కచ్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆరెస్సెస్కు మంచి పట్టు ఉంది. దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీ గెలుస్తూనే ఉంది. 2.24 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముస్లీం ఓట్లు 50 వేల వరకు ఉన్నాయి. ఆ తర్వాత 31వేల దళిత్ ఓట్లు, 25వేల పటీదార్ ఓట్లు, 21వేల రాజ్పుత్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 2017లో కాంగ్రెస్ తరఫున శక్తిసింహ గోహిల్, బీజేపీ తరఫున వీరేంద్ర సింహ జడెజాలు పోటీలో నిలబడ్డారు. ఇరువురు కూడా రాజ్పుత్లే.
సూరత్ (నార్త్) నియోజకవర్గం
సూరత్ నార్త్ నియోజకవర్గంలో పటీదార్ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. బీజేపీకి ఓటు వేయవద్దని సూరత్లోని పటీదార్లకు హార్దిక్ పటేల్ పిలుపునిచ్చారు. 2012లో ఇక్కడ బీజేపీ గెలిచింది. 2017లో బీజేపీ నుంచి కంటిభాయ్ హిమ్మత్ భాయ్, కాంగ్రెస్ నుంచి కచ్చాడియా దినేష్ భాయ్ మనుభాయ్ పోటీ చేస్తున్నారు.
కమ్రేజ్ నియోజకవర్గం
సూరత్ జిల్లాలో ఉన్న సెమీ అర్బన్ నియోజకవర్గం కమ్రేజ్. ఇది సౌరాష్ట్రలో ఎంతో కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ పటీదార్ల ప్రాబల్యం ఎక్కువ. 2017 ఎన్నికల్లో బీజేపీ నుంచి జలవాడియా వినుభాయ్ దహ్యా భాయ్, కాంగ్రెస్ తరఫున అశోక్ భాయ్ విరాజిభాయ్ చోడ్వాడియాలు పోటీ చేస్తున్నారు.
వరచ్చా రోడ్ నియోజకవర్గం
వరచ్చా మార్గ్ అసెంబ్లీ సూరత్ జిల్లాలో ఉంది. 2008 డీలిమిటేషన్ అనంతరం ఈ నియోజకవర్గం పుట్టుకు వచ్చింది. ఇక్కడ ఉన్న 3,02,669 ఓట్లలో 1,61,420 ఓట్లు పురుషులవి కాగా, 1,41,244 ఓట్లు మహిళలవి. 2017 ఎన్నికల్లో బీజేపీ నుంచి కిషోర్ కనాని, కాంగ్రెస్ నుంచి ధీరుభాయ్ గజేరాలు బరిలో నిలిచారు.
పోరుబందర్ నియోజకవర్గం
పోరుబందర్ జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన స్థలం. తాజా లెక్కల ప్రకారం ఇక్కడ 3,84,660 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1,97,622, మహిళా ఓటర్లు 1,87,038. 2017లో కాంగ్రెస్ నుంచి అర్జున్ భాయ్ దేవాభాయ్ మోధ్వాడియా, బీజేపీ నుంచి బాబుభాయ్ భీంబాయి బోఖిరియాలు పోటీలో ఉన్నారు.
రాధాన్పూర్ నియోజకవర్గం
రాధాన్పూర్ జిల్లా పఠాన్ జిల్లాలో ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ నుంచి లవింగ్జి టాకూర్, కాంగ్రెస్ నుంచి అల్పేష్ ఝాలాలు పోటీలో నిలిచారు.
ధరియాపూర్ నియోజకవర్గం
ధరియాపూర్ అహ్మదాబాద్ నడిబొడ్డున ంది. ఇక్కడ 46 శాతం మంది ముస్లీంలు ఉన్నారు. ఆ తర్వాత 14 శాతం ఓబీసీలు, 7 శాతం పటేల్స్ ఉన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఇక్కడ వ్యాపారులు అసంతృప్తికి గురయ్యారు. 1990 నుంచి 2007 మధ్య ఇక్కడ బీజేపీ గెలిచింది. 2012లో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు బీజేపీ నుంచి భరత్ బారోట్, కాంగ్రెస్ నుంచి గయాసుద్దీన్ హెచ్ షేక్ బరిలో నిలిచారు.