గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 10మంది మృతి ,17 మందికి గాయాలు
మితిమీరిన వేగం, వాహనచోదకుల నిర్లక్ష్యం వెరసి రహదారులు రక్తమోడుతున్నాయి . రోడ్డు ప్రమాదాల్లో నిత్యం వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన మరిచిపోకముందే, తాజాగా గుజరాత్ రాష్ట్రంలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్ నుంచి పావగడ కు వెళుతున్న వడోదర శివారులోని వాఘోడియా క్రాస్ రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న కంటెయినర్ ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. దాదాపు 17 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం ఘటనతో ప్రధాన జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Recommended Video
ఈ సంఘటనపై గుజరాత్ సీఎం విజయ్ రూపాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వడోదర సమీపంలో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్న సీఎం విజయ్ రూపాని గాయ పడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.మితిమీరిన వేగమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు .