ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నేరవేర్చాలంటే 45 ఏళ్లు కావాలి: రాహుల్ గాంధీ సెటైర్ !
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో గుజరాత్లో అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు సవాళ్లు, ప్రతివాళ్లు విసురుకోవడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
గుజరాత్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ ఇచ్చిన హామీపై తాజాగా రాహుల్ గాంధీ సెటైర్లు వేస్తున్నారు. నరేంద్ర మోడీ హామీలు మాత్రమే ఇస్తారని, వాటిని అమలు చెయ్యరని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు.
2012లో జరిగిన శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా వచ్చే ఐదేళ్లలో గుజరాత్ లో 50 లక్షల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఆ విషయం అప్పటి ఎన్నికల మోనిఫోస్టోలో కూడా బీజేపీ పెట్టిందని రాహుల్ గాంధీ అంటున్నారు.
అయితే ఐదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో కేవలం 4. 72 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని రాహుల్ గాంధీ అన్నారు. అంటే నరేంద్ర మోడీ, బీజేపీ లెక్కల ప్రకారం వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే గుజరాత్ లో 50 లక్షలు ఇళ్లు నిర్మించాడానికి ఇంకా 45 ఏళ్లు పడుతుందని రాహుల్ గాంధీ తన ట్వీట్టర్ పేజ్ లో ఎద్దేవ చేశారు. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ (యూపీఏ) ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు అంటూ బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ మీద ఎదురుదాడికి దిగుతున్నారు.