అంబేడ్కర్, మోడీ బ్రాహ్మణులే.. ఎందుకంటే?: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
అహ్మదాబాద్: సున్నితమైన అంశాలపై అనవసరంగా నోరు జారవద్దని స్వయంగా ప్రధాని మోడీ తమ పార్టీ నేతలను మందలించినప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ త్రివేది అంబేడ్కర్, మోడీలు బ్రాహ్మణులే అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
త్రివేది వ్యాఖ్యలను తప్పుపట్టిన బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్.. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతున్నారు. తమకున్న 'జ్ఞానం' కారణంగా.. ఈ ఇద్దరూ బ్రాహ్మణ వర్గానికే చెందుతారన్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
మరోవైపు త్రివేది మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 'కులం అనేది మనిషి పుట్టుక మీద కాకుండా అతడు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. భవద్గీత ప్రకారం విఙ్ఞానం ఉన్న వ్యక్తులు బ్రాహ్మణులు' అని చెప్పుకొచ్చారు.
ఇటీవల గాంధీనగర్ లో నిర్వహించిన సమస్త్ గుజరాత్ బ్రహ్మ సమాజ్ కార్యక్రమంలో త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కృష్ణుడు ఓబీసీ అని వ్యాఖ్యానించారు.