ఇకపై గుజరాత్లో హాజరును విద్యార్థులు ఇలా పలకాలని ఆదేశాలు
సాధారణంగా పిల్లలు తరగతి గదుల్లో టీచరు హాజరు పలికేసమయంలో ఎస్ సార్ అనో లేదా ప్రజెంట్ టీచర్ అనో పలుకుతారు. కానీ జనవరి 1 నుంచి గుజరాత్ విద్యార్థులు మాత్రం 'ఎస్ సర్', 'ప్రజెంట్ సర్'కు బదులు జైహింద్, జైభారత్ అని పలకుతారు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో జాతీయభావం పెరుగుతుందనే అభిప్రాయంలో ఉంది గుజరాత్ సర్కార్.
గుజరాత్లోని ప్రాథమిక విద్య, ఉన్నత విద్య బోర్డులు ఆదేశాలు జారీ చేశాయి. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు జైహింద్, జైభారత్ అని తమ హాజరును పలకాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అది జనవరి 1నుంచే అమలు చేయాలని వెల్లడించింది. చిన్నప్పటి నుంచే ఇలా విద్యార్థులకు అలవాటు చేస్తే వారిలో దేశం పట్ట మరింత గౌరవం పెరుగుతుందని జాతీయ భావనతో ఉంటారని పేర్కొంది. హాజరు జైహింద్, జైభారత్ అని పలకాలన్న నిర్ణయం ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింహ్ చుడాసమాదట. హాజరు జైభారత్, జైహింద్ అని పలకడంలో తప్పేముంది.. ఒక నిర్ణయం తీసుకున్నాక అది అమలు చేసి తీరాల్సిందే అని చుడాసమా అన్నారు.
ఈ మేరకు ప్రతి పాఠశాలకు, జిల్లా విద్యాధికారులకు నోటిఫికేషన్ పంపారు. కచ్చితంగా జనవరి 1నుంచి ఈ తరహా విధానం అమలు చేయాలని సూచించారు. అయితే దీనిపై స్పందించేందుకు మంత్రి అందుబాటులో లేరు. అయితే విద్యార్థులు హాజరును ఇలానే పలకడాన్ని కొందరు తప్పు బడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వారి వ్యక్తిగత అభిప్రాయాలను ఇలా విద్యార్థుల పై రుద్దడం సరికాదన్నారు. హాజరును జైహింద్, జైభారత్ అని పలకాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా విధానం అమలు కావాలని గుజరాత్ బీజేపీ చెబుతోంది.