నిత్యానంద ఆశ్రమంలో బందీలుగా విద్యార్థినులు: విడిపించాలంటూ హైకోర్టులో పిటీషన్..!
అహ్మదాబాద్: అత్యంత వివాదాస్పద పీఠాధిపతిగా పేరు తెచ్చుకున్న స్వామి నిత్యానంద ఆశ్రమం మరోసారి అవే వివాదాలతో వార్తల్లోకి ఎక్కింది. నిత్యానంద ధ్యానపీఠం ఆశ్రమంలో తమ ఇద్దరు కుమార్తెలు బందీలుగా ఉన్నారంటూ గుజరాత్ కు చెందిన దంపతులు ఆరోపించారు. తమ కుమార్తెలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ ఘటన అటు గుజరాత్ లో, ఇటు కర్ణాటకలో సంచలనం రేపింది.
ఐన్స్టీన్నే తప్పుబట్టిన స్వామి నిత్యానంద..త్వరలో కోతులు మాట్లాడతాయట
యోగిని సర్వజ్ఞపీఠం పేరుతో..
బెంగళూరు శివార్లలోని బిడదిలో స్వామి నిత్యానందకు ఆశ్రమం ఉంది. దీని అనుబంధంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పీఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోనూ ఇలాంటి ఆశ్రమం ఒకటుంది. యోగిని సర్వజ్ఞపీఠం పేరుతో ఇది కొనసాగుతోంది. అహ్మదాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో దీన్ని నెలకొల్పారు. అహ్మదాబాద్ కే చెందిన జనార్ధన్ శర్మ కుమార్తెలు లోపముద్ర, నందిత ఈ ఆశ్రమంలో చదువుకుంటున్నారు.
2013 నుంచి విద్యార్థినులుగా..
2013లో తొలిసారిగా తమ కుమార్తెను బిడది ఆశ్రమం ఆధ్వర్యంలోని విద్యాసంస్థలో చేర్పించామని, అనంతరం అహ్మదాబాద్ కు బదిలీ చేశామని జనార్ధన శర్మ పిటీషన్ లో వెల్లడించారు. అహ్మదాబాద్ కు బదిలీ చేసినట్లు తమకు లిఖితపూరకంగా మాత్రమే బదులు ఇచ్చారని, తమ కుమార్తెలను కలుసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదని ఆయన గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ.. అక్కడి సిబ్బంది తమను ఆశ్రమంలోనికి ప్రవేశించనివ్వట్లేదని వాపోయారు.
కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు..
అహ్మదాబాద్ కు బదిలీ చేసినట్లు తమకు లిఖితపూరకంగా తెలియజేసిన తరువాత నాలుగైదు సందర్భాల్లో మాత్రమే తాము కుమార్తెలను కలుసుకోగలిగామని జనార్ధన్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు రోజుల్లోనూ ఆశ్రమ నిర్వాహకులు తమ పిల్లలను ఇంటికి పంపించట్లేదని ఆరోపించారు. స్వామి నిత్యానంద స్వామి ఆశ్రమం నిర్వాహకులు తమ కుమార్తెలను కిడ్నాప్ చేశారని అందులో పేర్కొన్నారు.
Recommended Video
పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశం..
తమ కుమార్తెలను నిర్బంధించారని, వారిని వెంటనే విడిపించాలని కోరుతూ జనార్ధన్ శర్మ, ఆయన భార్య దాఖలు చేసిన ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణ స్వీకరించింది. అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు ఆదేశాలను జారీ చేసింది. లోపముద్ర, నందితలను వెంటనే విడిపించేలా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన పూర్తి నివేదికను న్యాయస్థానానికి అందజేయాలని ఆదేశించింది. ఆశ్రమం స్థితిగతులు, నిర్వహణపై విచారణ చేపట్టాలని సూచించింది.